పురానాపూల్లో ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం
వివిధ శాఖల నుంచి పూర్తిస్థాయిలో పర్మిషన్లు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం సర్వసాధారణమైపోయింది.
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్లో ఓ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి ఈ గోదాములో నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువగా ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో దట్టమైన పొగతో పాటు మంటలు కూడా ఎగసిపడుతుండటంతోపాటు ఆ మంటల ధాటికి గోదాము పైకప్పు కూలిపోయింది.
పురానాపూల్ లో భారీ అగ్నిప్రమాదం..కూలర్ల గోడౌన్ లో చెలరేగిన మంటలు..!!#Pooranapool #Hyderabad #FireAccident #HyderabadNews #Oneindiatelugu pic.twitter.com/JGwuRD2jxp
— oneindiatelugu (@oneindiatelugu) February 15, 2023
గోదాము పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధితోపాటు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనమతులు తీసుకోకుండా భవనాలను నిర్మించడం, వివిధ శాఖల నుంచి పూర్తిస్థాయిలో పర్మిషన్లు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం సర్వసాధారణమైపోయింది.

ఈ తరహాలో నిర్మాణమైన భవనాలను గుర్తించి పడగొట్టడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఆ తర్వాత కూడా ప్రజల్లో ఎటువంటి మార్పు రాలేదని తాజాగా జరిగిన అగ్నిప్రమాదంతో స్పష్టమైందని అగ్నిమాపక శాఖాధికారులు చెబుతున్నారు. రానున్నది వేసవి కాలం కావడంతో అగ్నిప్రమాదాలు మరిన్ని జరగడానికి ఆస్కారం ఉందని, వ్యాపార సంస్థలు, గోదాములున్నవారు ఒకటికి రెండుసార్లు భద్రతా చర్యలను ప్రతిరోజు తనిఖీ చేస్తుండాలని సూచించారు.












Click it and Unblock the Notifications