మునుగోడు తీర్పు నవ శకానికి నాంది: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు బై పోల్ గురించి డిస్కషన్ జరుగుతుంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఏదో ఒక అంశం తీసుకుని మాట్లాడుతున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తమదే విజయం అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రెండో, మూడో స్థానం కోసం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పోటీ పడతాయని చెప్పారు. బీజేపీ విజయం తథ్యం అని చెప్పారు.
తాను రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దిగి వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. కేసీఆర్ మాటలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు. మునుగోడు ఉప ఎన్నికతో వచ్చే తీర్పు చరిత్ర సృష్టించనుందని తెలిపారు. కమలం వికసించడం ఖాయం అని చెప్పారు. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
అయితై బై పోల్ గురించి అధికార పార్టీ మరోలా కామెంట్ చేస్తోంది. బై పోల్ వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఓ కుటుంబ స్వార్థం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని విమర్శలు చేస్తున్నారు. మునుగోడులో గెలుపు కోసం ఏ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలుపు సాధించేది మాత్రం టీఆర్ఎస్ అని విశ్వాసంతో ఉంటున్నారు. అసంతృప్తులతో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదంటున్నారు.
మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలో ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. పోటా పోటీగా సభలు నిర్వహించి తమ సత్తా చాటనున్నారు. బై పోల్ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉండనుంది. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటినుంచే జోరుగా కసరత్తు చేస్తున్నాయి. పార్టీలో ఉన్న అసంతృప్తులను కూల్ చేస్తున్నారు. తమ పార్టీ ఎలాగైనా గెలవాలనే ధీమాతో ఉన్నారు.