సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన... రేపటి నుంచి ఆ రిజిస్ట్రేషన్లు బంద్... ఇది ఆరంభం మాత్రమే...
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదని... ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అన్ని అంశాలపై తాజా బిల్లులో ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రేపటి నుంచి(శనివారం,సెప్టెంబర్ 12) దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు.

దేవాదాయ,వక్ఫ్ క్రయ విక్రయాల రద్దు...
దేవాదాయ, వక్ఫ్ భూముల క్రయ, విక్రయాలను శనివారం నుంచి రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. సమగ్ర సర్వే తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీలు,మున్సిపాలిటీల్లోనూ అనుమతులను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని... పలు చట్టాల సమాహారంగా దీన్ని రూపొందించామని చెప్పారు.

వీఆర్వో వ్యవస్థ రద్దుతో సంబురాలు
వీఆర్వో వ్యవస్థ రద్దుతో రాష్ట్ర ప్రజలు సంబురాలు చేసుకున్నారని కేసీఆర్ అన్నారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపడుతామన్నారు. భూముల క్రమబద్దీకరణ ద్వారా అందరికీ న్యాయం చేస్తామని... కౌలుదారీ వ్యవస్థను పట్టించుకోమని స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు అని... తమ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని చెప్పారు. ప్రభుత్వమే రైతు బంధు అందిస్తున్న నేపథ్యంలో అనుభవదారు కాలమ్ అవసరం లేదన్నారు. భూస్వాములు,జమీందారుల కాలంలో అనుభవదారులను పెట్టారని... ఇప్పుడు దాని అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో 93శాతానికి పైగా చిన్న,సన్నకారు రైతులే ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకూ 57 లక్షల 90 వేలమంది రైతులు రైతు బంధు సాయం పొందారని చెప్పారు.

అటవీ భూములపై కీలక ప్రకటన
ఆర్వోఎఫ్ఆర్(రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) భూములను పరిరక్షిస్తామని కేసీఆర్ చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు పట్టాలు కాదని... అటవీ భూములపై యాజమాన్య హక్కు మారదని చెప్పారు. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి తాము వెళ్లమని... అయితే ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు పొందిన ప్రజలు అవి పట్టాలు అన్న భ్రమలో ఉండవద్దని విజ్ఞప్తి చేశారు.ధరణి వెబ్సైట్లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్ కేటాయించామన్నారు.

పంచేందుకు భూములే లేవు...
రాష్ట్రంలో గ్రీన్ జోన్లను ప్రకటిస్తామని... అందులో నిర్మాణాలు జరగకుండా చూస్తామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ అంశం హైకోర్టు పరిధిలో పెండింగ్లో ఉందన్నారు. అసైన్డ్ భూములపై ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమై తమకు సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరారు. ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలోనే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక భూముల పంపిణీపై అసత్యాలు చెప్పబోమని.... ప్రజలకు పంచేందుకు అసలు ప్రభుత్వ భూములే లేవని అన్నారు.

సమగ్ర సర్వేతో సమస్యలకు పరిష్కారం...
ఉమ్మడి రాష్ట్రంలో 160 పైచిలుకు రెవెన్యూ చట్టాలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రంలోలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు. ధరణి ఒక్కటే కాదని, మిగిలిన చట్టాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్ నిర్వహణ ఉంటుందన్నారు. ధరణిలో భూముల డేటా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు. భూ వివాదాలకు సంబంధించి రెవెన్యూ కోర్టుల్లో 16వేల కేసులు, హైకోర్టులో 2వేల కేసులు ఉన్నాయని, సమగ్ర సర్వే ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.గ్రామాల్లో ఎవరి బతుకు వారు బతుకుతున్నారని.. అక్కడ వివాదంలో ఉన్న భూములు తక్కువ అని అన్నారు.












Click it and Unblock the Notifications