హుజురాబాద్ ఇంచార్జీలతో కేసీఆర్ భేటీ.. సెగ్మెంట్ల వారీగా వివరాల ఆరా..
హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్ఛార్జీలతో శుక్రవారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. సెగ్మెంట్ స్థితిగతులపై ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని గ్రౌండ్ లెవల్లో సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచిం చినట్లు తెలిసింది. ఇన్ఛార్జీలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. హుజూరాబాద్లో చేపట్టబోయే వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం వచ్చేలా చూడాలన్నారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి పనిచేసేలా కృషి చేయాలని కేసీఆర్ చెప్పారు.
బీజేపీ ఇంచార్జీలను కూడా నియమించింది. టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించింది ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొనే అవకాశాల మెండు. కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపినా.. ఏ మేరకు ప్రభావం చూపిస్తారనే అంశం స్పష్టత లేదు. టీడీపీ, కమ్యూనిస్టులు పోటీ చేసినా.. ఎఫెక్టు మాత్రం ఉండదు. ఇక్కడ గెలవడం ఈటల రాజేందర్కు జీవన్మరణ సమస్య. టీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా ఇప్పటినుంచే కృషిచేస్తోంది.
గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్లో ఎన్నికలు అనివార్యం అయ్యింది.