కేసీఆర్ రైతు బాంధవుడు.. అందుకే యాసంగి ధాన్యం కొనుగోలు, బీజేపీపై గంగుల నిప్పులు
టీఆర్ఎస్ ప్లీనరీలో విపక్షాలపై నేతలు ఏకీపారేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు. కరువు నుంచే వ్యవసాయ అనుకూల విధానాలు, ఎఫ్.సి.ఐ లాంటి సంస్థలు ఏర్పడ్డాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేశారు. 1967లో బాయిల్డ్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఎప్.సి.ఐ ఆవిర్భవించినప్పటీ నుంచి అనుసరిస్తున్న విధానాలకు తిలోదకాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమని ఫైరయ్యారు.
ధాన్యం కొనమనటం మన హక్కు అని.. కానీ కేంద్ర ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు. ఆదానీకి దాన్యం అమ్ముకొమ్మని బహిరంగంగా ఉత్తర్వులు ఇవ్వడం దారుణం అని ఖండించారు. సీఎం కేసీఆర్ లేకపోతే రైతు ఆగమయ్యేవాడని..మనుసున్న కేసీఆర్ ఎప్పటికీ రైతు పక్షపాతే అని చెప్పారు. రైతు కుటుంబాల దీవెనలు కేసీఆర్పై ఉంటాయని స్పష్టం చేశారు. నిజమైన రైతు బాంధవుడు కేసీఆర్ అని ప్రశంసించారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనే బాధ్యతల నుంచి పారిపోయినా కొనుగోలు చేస్తోన్న సీఎం కేసీఆర్కి అభినందనలు తెలిపే తీర్మానాన్ని మంత్రి బలపరిచారు. 'యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు ప్రవేశపెట్టిన ఈ అభినందన తీర్మాన్నాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ బలపరుస్తున్నానని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు, పాలకులకు చరిత్రపై అవగాహన ఉండాలని సూచించారు. తెలియకపోతే తెలుసుకోవాలని కోరారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో వాటి ఉత్పత్తిని పెంచే బాధ్యతను రాష్ట్రాలకు, వాటికి మద్దతు ధర నిర్ణయం, సేకరణ, సరఫరా బాధ్యతను పూర్తిగా కేంద్రానికి అప్పగించారు. ఇదీ రాజ్యాంగంలో రాసి ఉందని గంగుల కమలాకర్ అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.