తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్లకు చెక్.. ఊహించని నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్ హైకమాండ్..
ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు కొత్త పీసీసీ చీఫ్ను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం.. త్వరలోనే తెలంగాణలోనూ కొత్త పీసీసీ చీఫ్ను నియమించబోతోంది. ఈ మేరకు ఢిల్లీలో అధిష్టాన పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈసారి పీసీసీ చీఫ్తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని చేపట్టకూడదని అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నవారినే కొనసాగిస్తారా.. లేక వారికి పూర్తిగా చెక్ పెట్టేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

ఎందుకు నియమించట్లేదు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం నలుగురికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కట్టబెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ చేసిన ఈ ప్రయోగం.. ఎన్నికల్లో పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. పైగా ఆ సామాజికవర్గానికి ఇచ్చారు.. ఈ సామాజికవర్గాన్ని విస్మరించారు.. అన్న విమర్శలు కూడా వినిపించాయి. దానికి తోడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేస్తున్నది ఒకరిద్దరు మాత్రమే.

నలుగురిని నియమించి ఏం లాభం..
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం వర్కౌట్ కాకపోగా లేని తలనొప్పులు తీసుకొచ్చిందని ఏఐసీసీలో ఈ వ్యవహారాలను పర్యవేక్షించే కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఇదే విషయాన్ని ఆయన హైకమాండ్తో చెప్పినట్టు తెలుస్తోంది. చాంబర్ల కేటాయింపు దగ్గరి నుంచి పని విభజన వరకు అన్నీ విభేదాలే అని.. నలుగురి నియామకంతో ఒరిగిందేమీ లేదని ఆయన హైకమాండ్కు చెప్పినట్టు సమాచారం.

ఒకవేళ నియమిస్తే..
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కలిసిరాకపోవడంతో.. ఈసారికి అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకమే చేపట్టకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అవసరమైతే పీసీసీ చీఫ్ నియామకం తర్వాత.. ఆయన సూచనల మేరకు దానిపై ఆలోచన చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు,ఈసారికి రెడ్డి సామాజికవర్గానికి కాకుండా వేరే వర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీలో నేతల పైరవీలు..
ఓవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తుంటే.. మరోవైపు హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారట.
ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకే కట్టబెట్టాలని ఆయన ఢిల్లీ పెద్దల వద్ద పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. అయితే అంజన్ కుమార్ కలిసి నేతలంతా అధిష్టానం మనసులో మాటను సూటిగా చెప్పేయడంతో.. ఆయన కూడా సైలెంట్ అయిపోయినట్టు సమాచారం. మొత్తం మీద తెలంగాణలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీకి కలిసిరావట్లేదని కాంగ్రెస్ బలంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ పదవి ఎవరికి..
ఇక తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఎవరికి దక్కుతుందనే చర్చ కూడా చాన్నాళ్లుగా జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి,మాజీ మంత్రి చిన్నారెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్లు టీపీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ల పేర్లను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. వీళ్లలో అధిష్టానం ఎవరికి పదవిని కట్టబెట్టబోతుందన్నది పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications