బలిపీఠం మీద ఈటల... కేసీఆర్ ఇరికించారా... కరోనా వేళ కాక రేపుతున్న చర్చ...
కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందన్న విమర్శలు అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ వైఫల్యానికి బాధ్యత వహించేదెవరు... వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను నిందించాలా... లేక ముఖ్యమంత్రి కేసీఆర్ను కేసీఆర్ను నిందించాలా...? గత రెండు,మూడు రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఈటల రాజేందర్పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ... 'తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్ర..' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందులో రాజేంద్ర తప్పేమీ లేదని... కేసీఆర్ కావాలనే ఆయన్ను బలిపీఠం ఎక్కించారన్న అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.

బద్నాం చేయొద్దన్న ఈటల... సోషల్ మీడియాలో కౌంటర్స్...
హైదరాబాద్లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో రవి కుమార్ అనే యువకుడు ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటన పట్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మంత్రి ఈటల స్పందించిన తీరు చాలామందికి ఆగ్రహం తెప్పించింది. సర్కార్ దవాఖాన్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వేల మంది పేషెంట్లు రికవరీ అయి వెళ్లిపోతున్నారని... ఎవరో ఒకరిద్దరు చనిపోయినందుకు ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దని అన్నారు. అయితే ఆ ఒకరిద్దరివైతే ప్రాణాలు కాదా అంటూ ఈటలను సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేక.. లోపాలను సరిదిద్దుకోలేక.. ఇప్పటికీ అంతా బాగానే ఉందని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అంటున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఈటల రాజేందర్ను ఉద్దేశించి 'తల ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్రా' అని చేసిన వ్యాఖ్యలను... ఇప్పటి పరిస్థితికి అన్వయిస్తూ... సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ అదే కామెంట్తో ఈటలను ప్రశ్నిస్తున్నారు.

బలిపీఠంపై ఈటలపై... ఆసక్తికర చర్చ...
అయితే ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఈటల ఓ నిస్సహాయుడు అని... కేసీఆర్ తీరుపై చేష్టలుడిగిన మంత్రుల్లో ఆయన కూడా ఒకరని కొంతమంది వాదిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ పీరియడ్లో తరుచూ ప్రెస్మీట్స్ పెట్టిన కేసీఆర్... ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ముఖం చూపించలేక తప్పించుకు తిరుగుతున్నాడని విమర్శిస్తున్నారు. కరోనా పరిస్థితిని సరిగా డీల్ చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి... మంత్రి ఈటలను బలిపీఠం ఎక్కించాడని అంటున్నారు. రాజకీయంగానూ ఈ ఇద్దరి మధ్య కొంతకాలం క్రితం అంతర్గత విబేధాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకు మంత్రి పదవి ఇవ్వకూడదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా లీకులు రావడంతో... గులాబీ జెండాకు అసలు ఓనర్లం తామేనంటూ అప్పట్లో ఈటల పార్టీ అధినాయకత్వంపై ధిక్కారం వినిపించారు. ఆ తర్వాత ఈటలను మంత్రివర్గంలోకి తీసుకోవడం.. ఆ విబేధాలు సమసిపోయినట్టుగా కనిపించనప్పటికీ... అప్పటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఇప్పుడు ఈటలను ఇరికించేశాడన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాల నుంచి కూడా అవే విమర్శలు...
రెండు రోజుల క్రితం మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే అరుణ కూడా ఇలాంటి విమర్శలే చేశారు. సీఎం కేసీఆర్కు ఈటల రాజేందర్పై ఉన్న కోపమే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు శాపమైందన్నారు. ఓనర్లు,క్లీనర్ల పంచాయితీలో తెలంగాణ ప్రజలు బలిపశువులు అవుతున్నారని చెప్పారు. నిజానికి కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి ఈటలకు వాస్తవాలు తెలిసినా... ముఖ్యమంత్రిని ప్రశ్నించలేకపోతున్నాడని అన్నారు. కేవలం మంత్రి పదవిని కాపాడుకునేందుకే తమ వైఫల్యాన్ని ఒప్పుకోకుండా బీజేపీపై విమర్శలు చేస్తున్నాడన్నారు.
Recommended Video

ఇకనైనా మేల్కొనకపోతే...
మొత్తం మీద కరోనా వేళ ఈటల-కేసీఆర్ చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలు తెలంగాణలో కాక రేపుతున్నాయనే చెప్పాలి. చివరాఖరికి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. ఇక
ఇప్పటికీ టెస్టులు సరిగా చేయట్లేదని,ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలను కల్పించట్లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం... తప్పులను ఒప్పుకోకుండా ఇప్పటికీ దబాయించినట్టుగానే మాట్లాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించి... ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడం,టెస్టుల సంఖ్యను పెంచడం,ఆక్సిజన్,వెంటిలేటర్లను పెంచడం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ప్రజలే బలిపశువులు అవుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications