షాకింగ్: ఆ నీటిలో కరోనా వైరస్ - హైదరాబాద్లో 6.6 లక్షల కేసులు - సీసీఎంబీ పరిశోధనలో సంచలనాలు
రోజులు గడుస్తున్నకొద్దీ పాండమిక్(మహమ్మారి) ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసొస్తున్నది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదవుతోన్న వేళ ఇంకొన్ని షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజీ నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. మురుగునీటిపై చేసిన పరిశోధనల్ని బట్టి నగరంలో 6.6లక్షల పొటెన్షియల్ కేసులు ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. ఇదేదో అల్లాటప్పా అధ్యయనం కాదు..
Recommended Video

సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా..
హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయంగా ఖ్యాతిగడించిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం, పరిశోధనల్లో పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ డాక్టర్ రాకేష్ ఈ విషయాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. పరిశోధనల్లో సీసీఎంబీ నుంచి ఉదయ్ కిరణ్, కుంచా సంతోష్ కుమార్ ,రాకేశ్ మిశ్రా, ఐఐసీటీ నుంచి మనుపాటి హేమలత, హరీష్ శంకర్, వెంకట మోహన్ పాల్గొన్నారని తెలిపారు. వివరాల్లోకి వెళితే..

కొవిడ్ రోగుల విసర్జనాల్లో..
కరోనా వైరస్ ఒకరి నుంచి మరోకరికి వ్యాపిస్తుందని, తాకడం, దగ్గినప్పుడు, తమ్మినప్పుడు.. తప్పర్ల ద్వారా వైరస్ విస్తరిస్తుందని మనకు తెలిసిందే. ముక్కు, నోటి ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్ అనవాళ్లు ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. హైదరాబాద్ లోని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో 35 రోజులపాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని నిర్ధారించారు. మురుగు నీటి పరీక్షల ద్వారా వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిర్ధారించవచ్చని స్టడీ రిపోర్టులో పేర్కొన్నారు.

సిటీలో 6.6లక్షల కేసులు..
హైదరాబాద్ నగరంలో 40 శాతం మురుగు నీటిని వివిధ నీటి శుద్ధి కేంద్రాల్లో శుభ్రపరుస్తారు. ఆయా ప్లాంటుల్లో సీసీఎంబీ, ఐఐసీటీ పరిశోధనలు చేసి, వైరస్ వ్యాప్తిని దాదాపుగా నిర్ధారించారు. సైంటిస్టుల అంచనా ప్రకారం హైదరాబాద్ లో 6.6 లక్షల పొటెన్షియల్ కేసులు వచ్చాయి. అంటే అంతమందికి కరోనా సోకి.. గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉండొచ్చని వెల్లడైంది. అత్యాధునిక ప్రయోగాలు కాకుండా, సాంప్రదాయపద్ధతుల్లో లెక్కకట్టినా హైదరాబాద్ లో కనీసం 2.6 లక్షల మంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉండొచ్చని తెలుస్తోంది.

మురుగు నీటితో వైరస్ వ్యాపిస్తుందా?
కాగా, హైదరాబాద్ లోని మురుగు నీటిలో గుర్తించిన కరోనా వైరస్.. రోగ కారకాలు కావని.. అంటే, డ్రైనేజీ నీళ్ల ద్వారా వైరస్ వ్యాపించబోదని, అయితే ఈ పరిశోధనల ద్వారా సంక్రమిత రోగాలను మరింత అర్థం చేసుకునేందుకు వీలయిందని రిపోర్టులో తెలిపారు. ఆయా ప్లాంట్లలో మురుగు నీటిని శుద్ధి చేయడానికి ముందు, తర్వాత పరీక్షలు చేయగా, 80 శాతం కేంద్రాల్లో శుద్ధిచేసిన తర్వాత నీటిలో వైరస్ లేదని, దీంతో ఆ ప్లాంట్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లుగానే భావించాలని సీసీఎంబీ-ఐఐసీటీ పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications