జైలు అధికారికే టోకరా, సీబీఐ పేరుతో లేఖ, లక్ష సమర్పయామీ..
సైబర్ నేరగాళ్ల బరిలో పడొద్దని పోలీసులే చెబుతారు. జనాలకు అవగాహన కల్పిస్తుంటారు. మరీ వారి ఊబిలో ఆ పోలీసు విభాగానికి చెందిన వారు చిక్కుకుంటే ఎలా ఉంటుంది. అంటే వారు ఎదుటివారికి నీతులు చెబుతారు.. కానీ వారికి మాత్రం నో అంటారా అనే సందేహాం కలుగుతుంది. ఓ జైలు ఉన్నతాధికారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు.
లక్ష సమర్పయామీ..
చిక్కడమే కాదు దాదాపు లక్ష రూపాయలు సమర్పించుకున్నారట. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నఅధికారికి ఇటీవల ఫోన్ వచ్చింది. యువతులు చాటింగ్ చేశారు. తర్వాత నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడారు. ఆయనతో మాట్లాడించారు. దానిని రికార్డు చేశారు. ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు. ఇప్పటివరకు ఓకే.. కానీ తర్వాత అసలు నిజం బయటపడింది.
సీబీఐ పేరుతో..
తర్వాత కొన్ని రోజులకు సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో జైలు అధికారికి ఫోన్ వచ్చింది. అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని తెలిపింది. డబ్బులు చెల్లిస్తే మేనేజ్ చేసుకుంటానని నమ్మించాడు. సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు. రాహుల్ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి ఆయనకు ఫోన్ చేసి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. ఆ నంబరుకు జైలు అధికారి ఫోన్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించేందుకు రెండు విడతలుగా రూ. 97,500 చెల్లించుకున్నారు.
రెండు వీడియోలు..
తర్వాత కూడా మరోమారు ఫోన్ చేసి మరో రెండు వీడియోలు ఉన్నాయని, వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ అధికారిని గమనించి తోటి ఉద్యోగి విషయం ఆరా తీశారు. అది విని ఇది సైబర్ మోసం తప్ప మరోటి కాదని ఆయనకు చెప్పారు. కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.