డ్రంకన్ డ్రైవ్ చేస్తే ఉగ్రవాదులతో సమానం... పట్టుబడితే పదేళ్లు జైల్లో ఉండేలా కేసులు.. సజ్జనార్ వార్నింగ్
మద్యం సేవించి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు.తాగి బండి నడిపేవాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడేవారికి పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ వారం రోజులు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
నిన్న(డిసెంబర్ 28) ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్లో 402 మంది పట్టుపడ్డారని చెప్పారు. కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన నేపథ్యంలో... నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొదటి సారి పట్టుబడితే రూ.10వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని వెల్లడించారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
రోడ్డు ప్రమాదం జరిగితే.. పెద్ద వాహనంపైనే కేసు నమోదు చేయడం నిన్నటివరకూ ఉండేదని... ఇప్పుడు తప్పెవరిదో వారిపైనే కేసు నమోదు చేస్తున్నామని సీపీ స్పష్టం చేశారు. పెద్ద వాహనం, చిన్న వాహనం అని కాకుండా తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.
ఇక ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర గణాంకాలను సజ్జనార్ విడుదల చేశారు. ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6.65 శాతం నేరాలు పెరిగాయని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు 22.7 శాతం తగ్గాయని.. అలాగే మహిళలపై 18.6 శాతం, చిన్నారులపై 12.2 శాతం నేరాలు తగ్గినట్లు సీపీ తెలిపారు. అదే సమయంలో సైబర్ నేరాలు 135 శాతం పెరిగాయన్నారు. హత్యలు, దోపిడీలు 26 శాతం చొప్పున తగ్గగా... హత్యాయత్నం కేసులు 30 శాతం, అత్యాచారం కేసులు 33 శాతం తగ్గాయని తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరాలు 42 శాతం పెరిగినట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం 83 మందిపై పీడీ యాక్టులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆస్తుల కేసులకు సంబంధించి ఈ ఏడాది రూ.19 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు.