భారీవర్షాలు: హైదరాబాదులో తాగునీరు సురక్షితమేనా..? నీటి శాంపిల్స్ను ఎందుకు టెస్ట్ చేస్తున్నారు?
హైదరాబాదు: గత కొద్దిరోజులుగా హైదరాబాదు నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. దీంతో అత్యంత సుందరమైన నగరం ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైంది. జలప్రళయంతో భాగ్యనగరం అభాగ్యనగరంగా మారిపోయింది. ఇక వర్షం బ్రేక్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుండపోత వర్షం పడటంతో భాగ్యనగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక ఎటు చూసిన వరద ప్రవాహమే కనిపిస్తోంది. మంచినీళ్లు తాగాలంటే నగరవాసులు భయపడుతున్నారు. అసలే కరోనా కాలం.. దీనికి తోడు వరదలు. ఏ పురుగు నీళ్లల్లో పడి చనిపోయి ఉంటుందో అన్న భయం నగరవాసుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సువరేజ్ బోర్డు తాగునీరును పరీక్షిస్తోంది.

తాగునీరు సురక్షితమేనా...?
హైదరాబాద్ను వర్షాలు అతలాకుతలం చేశాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. తాగేందుకు మంచి నీరు కూడా దొరకడం లేదు. ఒకవేళ దొరికిన ఆ నీరు సురక్షితమా కాదా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నీటి శాంపిల్స్ను పరీక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు నీటి శాంపిల్స్ పరీక్షలను కూడా పెంచాలని అధికారులకు హుకూం జారీ చేశారు. గత 24 గంటల్లో మున్సిపల్ శాఖ అధికారులు 10,400 శాంపిల్స్ను పరీక్షల కోసం సేకరించారు. ఇది సాధారణ రోజుల్లో చేసే పరీక్షల కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

వాటర్ ట్యాంకులు, సంపుల్లో బ్లీచింగ్ పౌడర్
ఈ మొత్తం నీటి పరీక్ష ప్రక్రియ కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే వరదల కారణంగా ధ్వంసమైన నీటి ట్యాంకులను, పైపులకు యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాదు మహానగరంలో వరదల ధాటికి ఎక్కువగా ధ్వంసమైన ప్రాంతాల్లో వాటర్ క్యాన్లు, వాటర్ ప్యాకెట్లను ప్రస్తుతానికి అందజేయాలని మంత్రి చెప్పారు. ఇక ఇళ్లల్లో ఉండే వాటర్ ట్యాంకులు, వాటర్ సంపులను బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రం చేసుకోవాలని ఇంటి యజమానులను కోరారు. ఇక వరదల కారణంగా నీటిద్వారా సంక్రమించే వ్యాధులను అణిచివేసేందుకు క్లోరిన్ ట్యాబ్లెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమే అని ప్రభుత్వం తెలిపింది.
Recommended Video

అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
ఇక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నీటి సౌకర్యంపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే వారి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు 700 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని HMWSSB ఎండీ దానకిషోర్ తెలిపారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని దానకిషోర్ చెప్పారు. ఇక పొంగి పొర్లుతున్న మ్యాన్ హోల్స్ మరమత్తులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరినట్లు దాన కిషోర్ చెప్పారు. పనిచేసే సమయంలో శానిటరీ వర్కర్లందరూ గ్లవ్స్, మాస్కులు, హెల్మెట్లు విధిగా ధరించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇక చిన్న చిన్న మరమత్తులు, ట్యాంకులను శుభ్రంపరిచేందుకుగాను రూ.50 లక్షలు విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి HMWSSB ప్రతిపాదనలు పంపింది. దీనికి అదనంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని రిజర్వాయర్లను శుభ్రం చేసేందుకు గాను మరో రూ.5 లక్షలు నిధుల విడుదలకు జనరల్ మేనేజర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications