hyderabad: జనావాసాల్లోకి 15 అడుగుల కొండచిలువ -జీడిమెట్ల షాపూర్నగర్లో ఘటన -చివరికి
రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తుండటంతో పురుగుపుట్రా బయటికి రావడం సహజమే. అయితే, భారీ సరీసృపం ఒకటి జనావాసాల్లోకి చొరబడటంతో అక్కడివారంతా కంగారుపడ్డారు. హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి.
సిటీలోని కుత్బుల్లాపూర్ నియోజకర్గం షాపూర్నగర్లో కొండ చిలువ సంచారం కలకలం రేపింది. బుధవారం స్థానిక హమాలీ అడ్డాలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. పనుల కోసం అడ్డా మీదకు వచ్చిన హామాలీలు భారీ ఆకారంలో ఉన్న కొండచిలువను చూసి భయాందోళనతో పరుగులు పెట్టారు.
జనావాసాల్లోకి కొండచిలువ దూరిందన్న సమాచారం తెలిసిన వెంటనే జీడిమెట్ల సీఐ బాలరాజు.. స్నేక్ సొసైటీ సిబ్బందిరి అప్రమత్తం చేశారు. సొసైటీవారు ఘటనా స్థలానికి చేరుకుని, జాగ్రత్తగా కొండ చిలువను పట్టి బంధించి, ఫారెస్ట్ అధికారుల సమక్షంలో సమీపంలోని అడవిలో వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.