ఫాంహౌస్లో విషాదం: ఎయిర్గన్ పేలి బాలిక మృతి, అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫామ్ హౌస్లో ఎయిర్ గన్ పేలి ఓ బాలిక మృతిచెందింది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్హౌస్లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పేలుడు శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వావిలాల శివారులోని ఓ ఫామ్హౌస్లో బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫామ్ హౌస్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె శాన్వి(4) ఎయిర్గన్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను గడ్డిపోచారంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.

అయితే, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని.. తాను వైద్యం చేయనని చెప్పాడు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్లని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లాకి చెందిన నాగరాజు కుటుంబంతో సహా వచ్చి గత కొద్దిరోజులుగా ఈ ఫామ్ హౌస్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాగా, కోతులను, కొంగలను తరమాడానికి ఈ ఏయిర్ గన్ను వాడుతున్నట్లు ఫాంహౌస్ సిబ్బంది చెప్పారు.
ఈ క్రమంలో ఎయిర్ గన్తో పిల్లలు ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. ఈ ఫామ్హౌస్ హైదరాబాద్కు చెందిన ప్రకాష్, ప్రసాద్ రావు అనే వ్యక్తులదని స్థానికులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా కాల్చారా..? లేక పిల్లలు ఆడుకుంటుండగా గన్ పేలిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిన్నారం పోలీసులు పేర్కొన్నారు.
ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. వనపర్తి పట్టణంలోని బండార్నగర్కు చెందిన ఎండి మున్నా (16), ఎండి అజ్మత్ (16), ఏర్పుల భరత్ (17) పదో తరగతి చదువుతున్నారు. కాగా, మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువు దగ్గరకు వెళ్లారు. అనంతరం ఈత కొట్టేందుకు చెరువులో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కూడా చెరువులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి పోలీసులు తెలిపారు. ముగ్గురు యువకుల మరణంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications