హైదరాబాద్ మెట్రో బంపరాఫర్.. రూ. 59తో అపరిమిత ప్రయాణం
హైదరాబాద్: ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల కాలంలో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. వేసవిలోనూ భారీగా సంఖ్యలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రయాణికులను మరింతగా ఆకట్టుకునేందుకు మెట్రో రైల్ యాజమాన్యం మరో కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది.
భారత 77 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో ప్రత్యేక ప్రయోజనం అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారంతంలో ప్రయాణికుల అనుభూతిని మరింతగా పెంచేందుకు ఆ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేవలం రూ. 59తో తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్ను రీఛార్జ్ చేయడం ద్వారా ఆగస్టు 12, 13, 15వ తేదీల్లో అపరిమిత మెట్రో రైడ్ను ఆస్వాదించవచ్చని మెట్రో రైల్ పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో మెట్రో ప్రయాణాన్ని ఎంచుకోవడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ఈ స్వాతంత్ర్యం దినోత్సవ ప్రత్యేక ప్రమోషన్గా తీసుకొచ్చింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ను పొందవచ్చు.
ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులను ఆకర్షించడంతోపాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడం, హరిత వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా అన్ని రకాలుగా నగరం అభివృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ప్రకటన సందర్భంగా ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడారు.

తమ విలువైన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన ఆఫర్ను అందిస్తుండటం పట్ల తాము సంతోషిస్తున్నామని కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ ఆఫర్ ప్రయాణికుల ఛార్జీలు చౌకగా మార్చడమే కాకుండా రోడ్లపై ట్రాఫిక్ ను తగ్గించే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రయాణికులు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications