Hyderabad: బండరాళ్ల మధ్య ఇరుక్కుని 3 గంటలు నరకయాతన.. చివరికి ఏం జరిగిందంటే..!
కొన్ని చిన్న చిన్న సరదాలు ప్రాణాల మీదకు తెస్తాయి. గత డిసెంబర్ లో కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లిలో ఓ వ్యక్తి వేటకు వెళ్లి గుహ లోపల బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి దాదాపు 48 నరకయాతన అనుభవించిన తర్వాత బయటకు తీశారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. ఓ వ్యక్తి రాళ్ల మధ్య ఇరుక్కుపోయి 3 గంటల తర్వాత బయటకొచ్చాడు.
మహారాష్ట్రకు చెందిన రాజు ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి నివాసిస్తున్నాడు. అతను సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసిన అతను ఉత్సాహంగా రాయి పైకి ఇచ్చాడు. ఈ క్రమంలో పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు. బయటకు రావడానికి ఎంత ట్రై చేసినా సాధ్యం కాలేదు. దీంతో అతను కేకలు వేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రాజును బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి రాజు భూజానికి తాళ్లు కట్టి అతికష్టం మీద పైకి లాగారు. వెంటనే అతన్ని సికిందరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజు స్వల్ప గాయాలైనట్లు.. అతని ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 2022 డిసెంబర్ లో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు వేటకు వెళ్లి గుహలో తల కిందులుగా ఇరుక్కుపోయాడు.
అతడి కోసం జిల్లా యంత్రాంగా దాదాపు మూడు రోజుల పాటు శ్రమించి అతన్ని బయటకు తీసింది. తాను కుందేలు వేటకు వెళ్లినట్లు రాజు చెప్పాడు. ఈ క్రమంలో ఫోన్ కింద పడితే తీసుకోబోయి రాళ్ల మధ్య ఇరుక్కుపోయానని చెప్పాడు.