కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆగ్రహంతో మైక్ విసిరి కొట్టిన జగ్గా రెడ్డి .. ఎందుకంటే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది . ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంతో మైక్ విసిరేసి తన అసంతృప్తిని తెలియజేశారు . మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జీల నియామకంలో పార్టీ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు . కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. నాగార్జునసాగర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇది ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.

మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ సమావేశం .. ఇంచార్జ్ ల నియామకంతో రగడ
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు నాగార్జునసాగర్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జీలను నియమించాలని పార్టీ నాయకత్వం భావించింది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లు సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఇంచార్జ్ లుగా కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతిపాదించారు.కానీ దానిని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు.

కొత్తవారికి ఇంచార్జ్ లు ఇవ్వొద్దన్న జగ్గారెడ్డి .. మైక్ విసిరేసి గెలవని వాళ్ళు కూడా చెప్పే వాళ్ళా అని ఆగ్రహం
దీంతో జగ్గారెడ్డి స్థానికంగా ఉండే నేతలకు కాకుండా కొత్తవారికి ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు .ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని కొందరు నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవని ఒకరిద్దరు నేతలు కూడా నిర్ణయం తీసుకుంటారా అని జగ్గారెడ్డి సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక కొందరు సీనియర్ నేతలు ఇంచార్జ్ లను నియమించాలనేది పార్టీ నిర్ణయంగా తేల్చి చెప్పారు. దీంతో అగ్రహంతో జగ్గారెడ్డి తన చేతిలో ఉన్న మైక్ను వేదికపైకి విసిరికొట్టాడు. ఈ తరుణంలో మిగిలిన నేతలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొందరు ఆయన చర్య పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో పంచాయితీలే పార్టీ కొంప ముంచుతున్నా మారని హస్తం నేతలు
మున్సిపల్ ఎన్నికల మాట అటుంచి పార్టీలోని నేతలు ఇలా తరచూ కొట్లాటలకు దిగుతుంటే , ప్రతి దానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది .తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టకుండా ఇలా తరచూ ఏదో ఒక కీచులాటలకు దిగుతుంటే అది పార్టీని మరింత బలహీనం చేస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications