ఈటల భార్య పిటిషన్: భూముల సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ, కీలక ఆదేశాలు
హైదరాబాద్: అచ్చంపేట, హకీంపేట గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. సర్వే నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. భూముల సర్వేపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
భూముల సర్వే నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో జమున పిటిషన్ దాఖలు చేశారు. కాగా, కరోనా దృష్ట్యా కొన్ని రోజులు సర్వే వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు జూన్ 2 లేదా 3వ వారంలోసర్వే చేయాలని తహసీల్దార్ ను ఆదేశించింది.
అచ్చంపేట, హకీంపేట గ్రామ పంచాయతీల పరిధిలో భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఈటల రాజేందర్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మరోవైపు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూకబ్జా ఆరోపణల తర్వాత మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ సర్కారు తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి టీఆర్ఎస్ నేతలు, ఈటల రాజేందర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది.
Recommended Video
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఇలావుంటే, బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. ఈటల రాజేందర్ త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈటల ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, బీజేపీ నేత పెద్దిరెడ్డి మాత్రం ఈటలను పార్టీలో చేర్చుకునే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.