అప్పుడు తోకలు లేవు.. ఇప్పుడు పెట్టడంతోనే రగడ.. మల్లారెడ్డి దాడిపై కేఏ పాల్
మంత్రి మల్లారెడ్డికి నిన్న నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతుంది. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని కేఏ పాల్ అన్నారు. రెడ్డి సామాజిక వర్గ గొడవ, దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అన్నారు. మతాలను, కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని చెప్పారు.

అప్పుడు అలా..
గతంలో రాజకీయాల్లో ఉన్నవారు వారి పేరు పక్కన ఉన్న తోకను తీసేసి ప్రజలకు సేవ చేశారని కేఏ పాల్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చివరన రెడ్డిని తీసేశారని పాల్ గుర్తు చేశారు. మీడియా తీరుని కూడా పాల్ తప్పుపట్టారు. అనవసరమైన అంశాలకు, ప్రజలకు పనికిరాని వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాల్ వాపోయారు.

రెడ్లు తిట్టుకోవడం
ఇద్దరు రెడ్లు మీడియాలో తిట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇద్దరు యూట్యూబర్స్ కొట్టుకున్నారని మూడు రోజులపాటు మీడియా చానల్స్ లైవ్ ఇచ్చాయి. మీడియా.. ప్రజలకు చూపించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని హితబోధ చేశారు. చైనా 70 దేశాలకు అప్పు ఇచ్చిందని పాల్ తెలిపారు. చైనా ఇచ్చిన అప్పులు తిరిగి ఇచ్చేందుకు కొన్ని దేశాలు ముందుకు రావడం లేదన్నారు. అప్పు తీసుకున్న దేశాలు చైనాకు తిరిగి డబ్బు ఇవ్వకపోతే చైనా నాశనం అయిపోతుందన్నారు.

జైలులో పెట్టడం ఏంటీ..?
దేశంలో ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని పాల్ ధ్వజమెత్తారు. మూడు నెలల్లో సంచలనం సృష్టిస్తామని కామెంట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని ఓ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు పెడితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. కేఏ పాల్ ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఏపీ కాదు.. తెలంగాణ రాజకీయాలపై వేగంగా స్పందిస్తున్నారు. రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల వెళ్తుండగా.. సిద్దిపేటలో దాడి చేయడంతో వరసగా వార్తల్లో నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications