కవిత, కేటీఆర్ సంపాదన చూసి కేసీఆరే నోరెళ్లబెట్టారు: బండి సంజయ్
ముందస్తు ఎన్నికల గురించి ప్రగతిభవన్లో చర్చ జరుగుతుందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ఎప్పుడూ జరిగినా ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ను మార్చటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పేకాట, లిక్కర్ స్కాం సహా అన్ని ఈడీ కేసుల్లో కేసీఆర్ పుత్ర రత్నాలు ఉన్నారని ఆరోపించారు. కుమారుడు, కూతురు అక్రమ సంపాదన చూసి కేసీఆరే షాక్ అవుతున్నారట అని కామెంట్ చేశారు.
ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు మోటార్లకు మీటర్లు గుర్తుకొస్తాయని బండి సంజయ్ అన్నారు. విద్యుత్ ఛార్జీ, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చన్నారు. కేసీఆర్ తలకిందులుగా తప్పస్సు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదని, గెలిచేది బీజేపీనేనని జోస్యం చెప్పారు.

ఈడీ తన పని తాను చేసుకుపోతుందని బండి సంజయ్ అన్నారు. ఈడీ సోదాలతో తమకేమి సంబంధం అని ప్రశ్నించారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. హెల్త్ డైరెక్టర్ నుంచి సీఎంవో, ఆరోగ్య మంత్రికి భారీగా మూటలు అందుతున్నాయని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీష్ రావును భర్తరఫ్ చేయకుండా సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. ఇష్యూపై శ్రీధర్ అనే డాక్టర్ను బలి చేయటం అన్యాయం అని తెలిపారు.
గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటం దుర్మార్గం అని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు కలిసే ప్రయత్నం చేయకపోవటం బాధాకరం అన్నారు. మానవత్వం లేని మానవ మృగాలు పాలన చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications