మెగాస్టార్ కు మరోసారి కరోనా - ఐసోలేషన్ లో చిరంజీవి : టాలీవుడ్ ను వెంటాడుతున్న కోవిడ్..!!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారిన పడ్డారు. గతంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స తీసుకున్నారు. త్వరగానే కోలుకొని కోవిడ్ బాధితులకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు తిరిగి మరోసారి తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు చిరంజీవి ట్వీట్ లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తనతో కొద్ది రోజులుగా తనతో టచ్ లో ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఐసోలేషన్ లో చిరంజీవి
రాత్రి నుంచి ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని..త్వరలోనే బయటకు వస్తానని చిరంజీవి తన ట్వీట్ లో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న వేళ..ప్రధానంగా టాలీవుడ్.. పొలిటికల్ సర్కిల్స్ లోనూ ప్రముఖులు ఈ సారి కరోనా బారిన పెద్ద సంఖ్యలో పడుతున్నారు. తాజాగా మహేష్ బాబు సైం కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా కారణంగా తన సోదరుడు రమేష్ బాబు మరణించినా.. మహేష్ వెళ్లలేకపోయారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ పలువురు కరోనా బారిన పడ్డారు.
త్వరగా కోలుకోవాలంటూ
ఇక, ఇప్పుడు చిరంజీవి తనకు కరోనా సోకినట్లుగా ట్వీట్ చేయటంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ.. పొలిటికల్ సెలబ్రెటీలు కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి కరోనా పీక్ లో ఉన్న సమయంలో ప్లాస్మా దానం గురించి సైబరాబాద్ పోలీసుల ద్వారా నిర్వహించిన కార్యాక్రమాల్లో ప్రచార కర్తగా వ్యవహరించారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీలో కరోనా బారిన పడిన వారికి.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి తన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలు అందించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్... రాం చరణ్.. వరుణ్ తేజ్..ఆ తరువాత బన్నీ సైతం కరోనా బారిన పడి.. వేగంగా కోలుకున్నారు.
అటు సినిమాలు.. సినీ సమస్యల్లో
ఇప్పుడు చిరంజీవి సైతం కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వచ్చే నెల ప్రేక్షకుల మందుకు రానుంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ - ఏపీ ప్రభుత్వ మధ్య కొనసాగుతున్న టిక్కెట్ల ధరల వివాదంలోనూ చర్చల బాధ్యత తీసకున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అయ్యారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.