corona lockdown: పారిశుద్ధ్య కార్మికులకు వడ్డించి, వారితో భోజనం చేసిన కేటీఆర్
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇస్తున్నాయి. వారి సేవలను కొనియాడుతున్నాయి. తాజాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వారి సేవలను ప్రశంసించారు.
వారిని గౌరవిస్తాం..
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బందికి పూర్తి వేతనంతోపాటు ప్రోత్సాహకాలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు.
కార్మికులకు భోజనం వడ్డించి..
సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్న డీఆర్ఎఫ్ శిక్షణా కేంద్రంలో శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు వారికి భోజనం వడ్డించారు కూడా. కరోనా లాక్ డౌన్ సమయంలో వైద్యులు, పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని వారి సేవలను అభినందించారు.
అప్యాయంగా పలకరిస్తూ..
ఈ సందర్భంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికుడిని పలకరించి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు మంత్రి. కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చుట్టుపక్కల వారికి వివరించాలని మంత్రి కేటీఆర్ వారిని కోరారు. పారిశుద్ధ్య కార్మికల సేవలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Recommended Video
కేటీఆర్ సహపంక్తి భోజనంపై నెటిజన్ల ప్రశంసలు
వర్షాకాలం రాబోతున్నందున దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగానికి మంత్రి సూచించారు. కేటీఆర్ తోపాటు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు సిబ్బందితో సహపంక్తి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23 మంది మరణించారు. 194 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 728 మంది యాక్టివ్ కేసులున్నాయి.