కరోనా కలకలం: నలువైపులా నిర్లక్ష్యం! హైదరాబాదీల బాధలు ఎవరికీ పట్టవా?
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం లేదని, కరోనా వచ్చిన వారి కాంటాక్టులను ట్రేస్ చేయడం లేదని మండిపడుతున్నారు.

అధికారులు కానరావడం లేదు..
కాగా, జులై 5న సికింద్రాబాద్కు చెందిన ఓ కానిస్టేబుల్కు కరోనా సోకింది. అయితే, అతని కుటుంబసభ్యులను ఎవరినీ కూడా అధికారులు పరీక్షించలేదు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్ కుటుంబసభ్యులే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వెళ్లి తమను కంటైన్ చేయాలని, తమ భవనాన్ని శానిటైజ్ చేయాలని కోరారు. మరోవైపు తమ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైదరాబాద్ నగర వాసులు ఆరోపిస్తున్నారు. బారికేడ్లు పెట్టి కంటైన్మెంట్ జోన్లుగా కూడా ప్రకటించడం లేదని మండిపడుతున్నారు.

కంటైన్మెంట్ జోన్లు?
ఇతర రాష్ట్రాల్లో కంటైన్మెంట్ జోన్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నా.. తెలంగాణ సర్కారు మాత్రం అలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. హైకోర్టు ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్-2 మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం, అధికారులు పాటించడం లేదని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గర్శకాల ప్రకారం.. కరోనా చైన్ను తెంచాలనే ఉద్దేశంతోనే కంటైన్మెంట్ జోన్లను ప్రకటించాలి. కరోనా కేసులను బట్టి కంటైన్మెంట్ జోన్లను స్థానిక జిల్లాల కలెక్టర్లు నిర్ణయించి కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖకు తెలియజేయాలి.

కరోనా సమాచారం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన కరువు..
ఇది ఇలావుంటే, జూన్ 18న పాతబస్తీలోని ఓ అపార్ట్మెంట్లో ఓ జువెల్లరీ వ్యాపారికి కరోనా సోకింది. ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అయితే, కరోనా సోకిన అపార్ట్మెంట్కు ఏ అధికారి కూడా రాకపోవడం గమనార్హం. కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఇతరులకు ఆ వైరస్ సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాను నగల వ్యాపారికి కరోనా సోకిన క్రమంలో చార్మినార్ పోలీసులకు, అలాగే జీహెచ్ఎంసీ అధికారులకు, టోల్ ఫ్రీ నెంబర్ 104కు కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చానని..అయితే ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు రాలేదని స్థానిక వ్యక్తి ఒకరు మీడియాకు తన ఆవేదనను చెప్పుకున్నాడు. కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది నగరంలో జరగడం లేదని హైదరాబాద్ వాసులు ఆరోపిస్తున్నారు.

కరోనా టెస్టులు, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రశ్నార్థకమే..
తెలంగాణలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నప్పటికీ కరోనా కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు కొనసాగిస్తున్నాయి. కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు కూడా తెలంగాణ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని, కరోనా నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తున్నప్పటికీ తెలంగాణ సర్కారు తీరులో ఎలాంటి మార్పూ రాలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయడంలో, కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ లో మిగితా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బాగా వెనుకబడిపోయిందనే ఆరోపణలున్నాయి.

హైదరాబాద్లోనే దాదాపు 90శాతం కరోనా కేసులు
కాగా, హైదరాబాద్లో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, అయితే ప్రజలకు వీటి గురించి తెలియకూడదని ప్రభుత్వం భావిస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్ని కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయనే విషయాన్ని కూడా ఆయన బయటికి చెప్పలేదు. ఇది ప్రభుత్వ రహస్యమని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 29,536 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,933 యాక్టివ్ కేసులున్నాయి. 17,279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 324 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా, 23,358 కరోనా పాజిటివ్ కేసులుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications