గిరిజన బంధు, బీసీ బంధు కూడా.. బండి కొత్త డిమాండ్, మైనంపల్లి కౌంటర్
హుజురాబాద్ బై పోల్ హీటెక్కిస్తోంది. నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇటు సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. దళిత బంధుతోపాటు గిరిజన బంధు, బీసీ బంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

దరఖాస్తుల ఉద్యమం..
ప్రజల కోసం బీజేపీ చేపట్టబోయే దరఖాస్తుల ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదాదికారుల సమావేశానికి హాజరైన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటు బండి సంజయ్పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిన్న విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇవాళ ఆ కామెంట్స్కు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మైనంపల్లి హనుమాంతరావు మరోసారి స్పష్టం చేశారు. బండి సంజయ్ ఓ వెధవ.. త్వరలోనే బట్టలిప్పి రోడ్డుమీద నిల్చో పెడతా అని హెచ్చరించారు.

ఒక్క ఛాన్స్ ప్లీజ్..
కేసీఆర్ ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గుండు సంజయ్ను బరాబర్ తిడతానని తెలిపారు. తనకు బహిరంగ క్షమాపణ చెబితే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తొందరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం మీడియా ముందు పెడతానని తెలిపారు. మల్కాజ్గిరి ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని...అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు.

మరోవైపు ఇలా..
మరోవైపు దళితబంధుపై నిరసనలు మిన్నంటుతూనే ఉన్నాయి. అన్నీ చోట్ల.. అర్హులకు పథకం కేటాయించాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు స్థానికులు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దళితులు దగ్దం చేశారు. సీఎం కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ ఇటీవల హెచ్చరించారు. పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో వరంగల్లోని బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందాలని దయాకర్ మాదిగ అన్నారు. లేదంటే సెప్టెంబరు 5న హుజూరాబాద్లో దళిత గర్జన సభ నిర్వహించి ఆందోళన చేపడతామన్నారు.

రూ.10 లక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఈ నెల 31లోగా దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హసన్పర్తి మండల కార్యాలయం నిరాహార దీక్ష చేపట్టారు. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో 2 వేల కోట్లు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని దళితులు ఆలోచించాలన్నారు. దళితబంధును ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక నియోజకవర్గంపైనే ప్రేమ చూపించడం సరికాదన్నారు.

ఇంతకుముందు కూడా ఇక్కడినుంచే
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

అబద్దాలే..?
దళిత బంధు పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications