PRIYANKA REDDY MURDER: ఫిర్యాదు చేసినా ...నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలున్నా కాపాడలేకపోయారే !!
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు నిమిషాల్లో మీ ముందు ఉంటామని ప్రియాంక రెడ్డి హత్య తర్వాత చెబుతున్న పోలీసులు ప్రియాంక రెడ్డి ఇంటికి రాకపోవడంతో, ఆమె ఫోన్ స్విచాఫ్ కావడంతో తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదు అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమౌతుంది.
Priyanka reddy murder: మా ఫిర్యాదుకు పోలీసులు స్పందిస్తే మా పాప బ్రతికేది : ప్రియాంక తల్లిదండ్రులు
ప్రియాంకా రెడ్డి హత్య తర్వాత మహిళల భద్రతపై స్పందిస్తున్న పోలీసులు..
ప్రియాంక రెడ్డి హత్య తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం లో ఉన్న 100 కు డయల్ చేయాలని, మహిళల భద్రత కోసం తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. ప్రియాంక రెడ్డి హత్య జరిగిన తరువాత నుండి డీజీపీ మహేందర్ రెడ్డి నుండి పోలీస్ కమిషనర్ ల వరకు ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని ఊదరగొడుతున్నారు.
ఒక్క కాల్ చేస్తే చాలు నిముషాల్లో మీ ముందు ఉంటాం అంటున్న సీపీ అంజనీ కుమార్
ఇక ప్రియాంకా రెడ్డి హత్య నేపథ్యంలో ఎవరైనా ఆపదలో ఉన్నామని భావిస్తే, వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఏ క్షణంలో అయినా అభద్రతా భావం కలిగితే డయల్ 100ను సంప్రదించాలని కోరారు. పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ సమాచారం అందుకున్న 6 నుంచి 8 నిమిషాల్లోనే మీ ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. ఇక హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని తెలిపారు. వెంటనే సాయం చేసేందుకు మీ ముందుకు వస్తాయని తెలిపారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.
122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా ప్రియాంకా రెడ్డిని కాపాడలేదు ఎందుకు ?
అయితే ఇప్పుడు ప్రజల నుండి పోలీసులకు పలు ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా టోల్ ప్లాజా కు సమీపంలో ఇంత దారుణం జరుగుతున్నా గుర్తించలేకపోయారు అని అడుగుతున్నారు. తన కుమార్తె ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలా అమర్యాదగా మాట్లాడారని, పట్టించుకున్న పాపాన పోలేదని ప్రియాంక రెడ్డి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎవరితో లేచిపోయిందోనంటూ ఇబ్బందికరంగా మాట్లాడారని పేర్కొన్నారు.
Recommended Video
ఫిర్యాదు చెయ్యటానికి వెళ్తే అమర్యాదగా ప్రవర్తించిన పోలీసుల తీరు
ప్రియాంక మిస్సింగ్ కేసు తమ పరిధిలోకి రాదని శంషాబాద్ పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేయమన్నారని ప్రియాంక తండ్రి తెలిపారు. అక్కడికి వెళ్తే ప్రియాంక మిస్సయిన ప్రాంతం శంషాబాద్ కిందకే వస్తుందన్నారని, అక్కడికి వెళ్తే ఇక్కడికి అని, ఇక్కడికి వస్తే అక్కడికి అని తిప్పుకున్నారని ఆయన చెప్పారు. ఇలా ఫిర్యాదు తీసుకోవడానికే రెండు, మూడు గంటల పాటు తిప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక తండ్రి.
పోలీస్ స్టేషన్ కు వెళ్తే దిక్కు లేదు .. ఫోన్ లో చెప్తే కాపాడటారా ? పోలీసులకు ప్రశ్న
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని ప్రియాంక తండ్రి వాపోయారు. ఇక పోలీసులు మాత్రం ఒక కాల్ చేయండి నిమిషాల్లో మీ ముందు మేముంటాం. నగరంలో నిత్యం 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయి. ఎప్పటికీ పోలీసులు మీ వద్దకు వచ్చి మీ కోసమే పని చేస్తారు అని చెబుతుండడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోని పోలీసులు, ఫోన్ చేసి చెప్తే పట్టించుకుంటారా అన్న ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా చేతులు కాలక ముందే జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని, పోలీసులు కాస్త నిర్లక్ష్యాన్ని వీడి పని చెయ్యాలని చెప్తున్నారు ప్రజలు . అలా చేసి ఉంటె ప్రియాంకా రెడ్డి విషయంలో ఇంత దారుణం జరిగేది కాదని ప్రజలు అంటున్నారు.