హైదరాబాద్ వర్షాలు: గత 111 ఏళ్లలో మూడో సారి నగరం తడిసి ముద్దయ్యింది
Recommended Video
హైదరాబాద్: హైదరాబాదులో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధవారం కురిసిన భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో అయితే పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొన్ని కాలనీల్లో నీళ్లు నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీశారు.
ఒక్క సెప్టెంబరు నెలలో గత 111 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షం కురిసింది. అంతేకాదు నగరమంతా తడిసి ముద్దయ్యింది. 75 మిల్లీమీటర్ల వర్షపాతం 24 గంటల్లో రికార్డయ్యింది. సెప్టెంబర్ నెలలో ఇలా నగరమంతా తడిసి మద్దవడం గత 111 ఏళ్లలో ఇది మూడో సారి కావడం విశేషం. 1908 సెప్టెంబర్ 27న, 153 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యిందని వాతావరణశాఖ చెబుతోంది. 2017 సెప్టెంబర్ 6న 90.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై రెండోదిగా రికార్డులకు ఎక్కినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే గురువారం రోజున కూడా జంటనగరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక జంటనగరాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మాధాపూర్లోని ఫిట్నెస్ ట్రైనర్ షార్ట్సర్క్యూట్తో మృతి చెందగా మరో 43 ఏళ్ల పూజారి చైతన్యపురిలోని కాలువలో పడి మృతి చెందాడు. ఒక్క తిరుమలగిరిలోనే 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హూస్సేన్ సాగర్లో ట్యాంకు పూర్తిగా నిండిపోయి రోడ్డుమీదకు నీరు చేరింది. 513 మీటర్లు సామర్థ్యం ఉండగా నీరు 513.70 మీటర్ల వరకు వచ్చేశాయి. సాధారణంగా సెప్టెంబర్ నెలలో హైదరాబాదులో 30 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందని అయితే ఈ సారి అసాధరణ స్థాయిలో వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షాలు దేశవ్యాప్తంగా ఇదే నెలలో కురుస్తాయని చెప్పారు.
దక్షిణ ఆంధ్రప్రదేశ్లో గాలితుఫాను ప్రభావంతోనే అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గాలి తుఫాను కర్నాటక, రాయలసీమ, తెలంగాణలపై ప్రభావం చూపుతోందన్నారు. దీని ప్రభావంతో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత క్రమంగా ఈ తుఫాను బలహీనపడుతుందని వివరించారు.