వరద సాయం పేరుతో డ్రామాలు, గులాబీ గద్దలు రూ.200 కోట్లు దోచాయి, రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. వరద సాయం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే తపన తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మీ సేవా కేంద్రాల సామర్థ్యంపై సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరం అన్నారు. వరద సాయం పంపిణీలో సరైన పద్ధతి పాటించలేదని.. ఇదీ పరిపాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు.

గంటల తరబడి నిరీక్షణ
మహిళలు, పిల్లలు మీ సేవా కేంద్రాల దగ్గర గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమస్యను గుర్తించేందుకు సిద్ధంగా లేరన్నారు. వారిద్దరు ఎలక్షన్లలో ఎలా డబ్బులు పంచాలి, ప్రజలను ఎలా మభ్యపెట్టాలి, మళ్లీ గ్రేటర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోవాలనే ఆతృతే ఉందని ఆరోపించారు.

200 కోట్ల దోపిడీ
వరద సాయం పంపిణీలో గులాబీ గద్దలు 200 కోట్లకు పైగా దోచేశాయని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దోపిడీకి గ్రేటర్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల టీఆర్ఎస్ నేతలకు సానుభూతి లేకపోవడం శోచనీయమన్నారు. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణం ఎవరూ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరద సాయం కోసం క్యూలైన్లో నిల్చొని మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

పేదోళ్లతో ఆటలు
పేదోళ్లతో ఆడుకున్న టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం గల్లీకి వచ్చే టీఆర్ఎస్ లీడర్లను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని భాగ్యనగర వాసులను కోరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి గ్రేటర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. అన్యాయాన్ని ప్రశ్నిస్తుందని చెప్పారు.

కౌన్ బనేగా..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications