Southwest Monsoon: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు, 8 నాటికి రుతుపవనాలు
హైదరాబాద్: సాధారణంగా జూన్ 1న రావాల్సిన నైరుతి రుతుపవనాలు కేరళను మూడు రోజుల ముందుగానే తాకాయి. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడే స్థిరంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా మే నెలలో రుతుపవనాలు వేగం పెరిగిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అందుకే దేశంలో నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించాయన్నారు.
రానున్న మూడు నాలుగు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలో మరింత ముందుకు కదులుతాయని చెప్పారు. అక్కడ్నుంచి ఈశాన్య ప్రాంతంవైపు నెమ్మదిగా పురోగమించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని మహాపాత్ర వివరించారు. బంగళాఖాతంలోని పరిస్థితుల కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో నెమ్మదించాయన్నారు. నైరుతుపవనాల ప్రభావంతో శనివారం కేరళలో పలు ప్రాంతాల్లో 2.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
కాగా, జూన్ 8 నాటికి రుతుపవనాాలు తెలంగాణకు చేరతాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. కాగా, ఆదివారం పగలు అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా గరిమెళ్లపాడు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో 3 సెం.మీ, లింగాపూర్(కుమురంభీం)లో 3, నాచారం(మేడ్చల్)లో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మరోవైపు, ఆదివారం పగటిపూట అత్యధికంగా నిడమనూరులో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నుంచి మే 28 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా, తెలంగాణలో మాత్రం స్వల్ప వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారిమాత్రం మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.