మెట్రో స్టేషన్లో యువతి కాలికి గాయం, తీవ్ర రక్తస్రావం, సిబ్బంది నిర్లక్ష్యం(వీడియో)
హైదరాబాద్: మెట్రో రైలు సిబ్బంది తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నగరంలోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో గురువారం సాయంత్రం ఓ యువతి రైలు దిగి ఎస్కలేటర్ ద్వారా కిందికి వస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలు ఇరుక్కుపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయమైంది.
యువతికి తీవ్ర రక్తస్రావమైనా.. మెట్రో సిబ్బంది నిర్లక్ష్యం
యువతికి గాయం నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఫస్ట్ ఎయిడ్ కోసం మెట్రో సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని చెప్పారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో బాధితురాలు అపస్మారకస్థితిలోకి చేరుకుంది. తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో కొందరు ప్రాథమిక చికిత్స చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మెట్రో స్టేషన్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉండదా?
కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేకుండా మెట్రో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాయమై రక్తం కారుతుందని చెప్పినా.. వెంటనే స్పందించకపోవడంపై మెట్రో యాజమాన్యంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రోపై నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి మెట్రో యాజమన్యంపై తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. నెటిజన్లు కూడా మెట్రో సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యమా? మీకు డబ్బే ముఖ్యమా? ప్రయాణికుల భద్రత పట్టదా? అని ధ్వజమెత్తుతున్నారు.
స్పందించిన హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యమని చెప్పింది. ఘటనపై చింతిస్తున్నామని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు.
ఇది ఇలావుండగా, మెట్రో రైలు సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పడింది. మియాపూర్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో సుమారు అరగంటకుపైగా సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. అరంగటపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరచూ ఇలాంటి సమస్యలు ఎదురవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications