కర్ణాటకతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. కానీ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన ముందస్తుకు వెళ్లారు. సో.. ఈసారి కూడా అలా చేస్తారని అంటున్నారు. మునుగోడులో బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇలానే అంటున్నారు.
సీఎం కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. కర్ణాటకతోపాటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగాలి. అంటే 7 నెలలు ముందుగానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారట.
సో.. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. అధికార దుర్వినియోగంతో మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలవబోయేది బీజేపీయేనని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలీయ శక్తిగా అవతరించనుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వివరించారు.