ఎకరం భూమి రూ 24.22 కోట్లు - హైదరాబాద్ లో భూముల విలువ ఖరారు : ఏ ఏరియాలో ఎంత..!!
హైదరాబాద్ లో ఇప్పటి వరకు ప్రయివేటు భూముల విలువ అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ భూమలు ప్రభుత్వ విలువలను సైతం ఖరారు చేసారు. అందులో భాగంగా ప్రధానంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన సరూర్నగర్, బహదూర్పురా మం డలాల్లో ఎకరం రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.24.22 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఎక్కడ ఎంత మేర ధర...
ఆ తర్వాత హైదర్నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్ఘాట్లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు. వీటితో పాటుగా.. గచ్చిబౌలి, మియాపూర్, నానక్రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు.
కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి. ఇదే సమయంలో.. స్థిరాస్తుల కొత్త మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం బారులు తీరుతున్నారు.
మారనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
దీంతో జిల్లాల్లోని సబ్రిజిస్ట్రార్, తహశీల్దారు కార్యాలయాల్లో లక్ష్యానికి మించిన రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. డాక్యుమెంట్ల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో నమోదయ్యే రిజిస్ట్రేషన్లతో పోలిస్తే నాలుగైదు రోజుల నుంచి నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య 50-55 శాతానికి పెరిగినుట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సవరించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు..భూముల విలువ సవరణ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50శాతం, ఖాళీ స్థలాల విలువను 35శాతం, అపార్ట్మెంట్ ఫ్లాట్ విలువను 25నుంచి 30శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది.
Recommended Video
ప్రతిపాదనల పైన చర్చ - నిర్ణయం
ప్రస్తుత మార్కెట్ విలువకు అలాగే సవరించిన విలువకు మధ్య వ్యత్యాసం 35 నుంచి 40 శాతం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వాణిజ్య సముదాయాల్లో కూడా అన్ని ఫ్లోర్లకు ఒకే మార్కెట్ విలువను అధికారులు నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇక తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 25 నుంచి 30 శాతం దాకా విలువను పెంచారు.
వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కూడా 50 శాతం పెరిగింది. సుదీర్ఘ సమీక్ష తర్వాత స్టాంప్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ప్రతిపాదనలను తాజాగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపింది. ఈ రోజు, రేపు ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.