మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?: కేసీఆర్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో డెంగ్యూ విజృంభించడంతో చిన్నారుల నుంచి మహిళలు, వృద్ధులు, యువకులు కూడా మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారించింది.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..
ఈ క్రమంలో డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదంటూ మండిపడింది. రాష్ట్రంలో ఓ వైపు ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ మరణాల నేపథ్యంలోకరుణ అనే వైద్యురాలు గతంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొంత కాలంగా హైకోర్ట్ బెంచ్ విచారణ చేపడుతోంది.

తెలంగాణ సర్కారుపై అసంతృప్తి..
అయితే, బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిల్పై మరోసారి విచారణ చేపట్టింది. కాగా, రాష్ట్రంలో డెంగ్యూ పరిస్థితి, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అడ్వకేట్ జనరల్ నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఎంతమందికి డెంగ్యూ జ్వరాలు వచ్చాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయాన్ని నివేదించారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆచరణలో ఏదంటూ ఆగ్రహం..
డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఏమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, హోర్డింగ్లు ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ మరణాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సర్కారు తీరు దారుణం
రాష్ట్రంలో డెంగ్యూ కారణంగా ఇంత మంది ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు గురువారం ఉదయం హైకోర్టు ధర్మాసనం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

తమ ముందు నివేదికతో హాజరుకావాలంటూ..
ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ కూడా వ్యక్తిగతంగా గురువారం ఉదయం హాజరుకావాలని సూచించింది. ఇప్పటి వరకు డెంగ్యూ నివారణకు తీసుకున్న చర్యలేంటి? డెంగ్యూను నియంత్రించేందుకు తమకు ఉన్న ఇబ్బంది ఏమిటో పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. గత కొంత కాలంగా డెంగ్యూ జ్వరం కారణంగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు వందమందికిపైగా జనాలు మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications