రావణ రాజ్యం చేశారు..? నిధులు గుజరాత్కు, హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారు: కేటీఆర్
ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. నిధులు గుజరాత్కు ఇస్తూ.. హైదరాబాద్లో పర్యటనలు చేస్తారా అని అడిగారు. హైటెక్ సిటీ - బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన కైతలాపూర్ ఆర్వోబీని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడారు. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ రానున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ స్పందించారు.
అన్యాయమే చేశారు..?
8 ఏళ్లుగా తెలంగాణకు ఏం సాయం చేశారు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నారని నిలదీశారు. వేల కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రకటనలు చేస్తారే తప్ప, అందులో వాస్తవం ఉండదని విమర్శించారు. 2014లో జన్ ధన్ ఖాతాలు తెరవాలని చెప్పారని, రూ.15 లక్షలు వేస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఒక్కరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు పడ్డాయా? అని ప్రశ్నించారు.
పేదవాడికి ఇల్లు ఏదీ..?
పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పారని, ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. ఇంటింటికీ కుళాయి నీరు అందిస్తామని చెప్పారని, తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో తామే ఇంటింటికీ నీరు అందిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని వివరించారు.
వరదలు వస్తే..?
గతేడాది హైదరాబాద్ మహానగరంలో వరదలు వస్తే, పేదలకు రూ.10 వేల కోట్ల మేర సాయం చేశామని కేటీఆర్ చెప్పారు. సాయం అడిగితే ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని అన్నారు. గుజరాత్లో వరదలు రాగానే మాత్రం వెంటనే స్పందించారని తెలిపారు. హుటాహుటీన వెళ్లి రూ.1000 కోట్లు ఇచ్చారని విమర్శించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నామని చెబుతున్నారని, ఏం చేయడానికి వస్తున్నారు? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రావణకాష్టం
దేశాన్ని రామరాజ్యం చేస్తామన్నారు... కానీ రావణ కాష్ఠం చేశారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టారు. దేశంలో మతపిచ్చి లేపారు. అగ్నిపథ్ అనే పథకం తీసుకువచ్చి దేశ యువత పొట్టకొడుతున్నారు. వాళ్లు నిరసనలు తెలుపుతుంటే, వాళ్లను దేశద్రోహులు అంటున్నారు.