చర్లపల్లి జైలు వద్ద టెన్షన్ టెన్షన్, భారీగా చేరుకుంటున్న జనం, వి వాంట్ జస్టిస్ అని నినాదాలు..
దిశ హత్య కేసు నిందితులు ఉన్న చర్లపల్లి జైలు వద్దకు భారీగా జనం చేరుకుంటున్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు అప్పగించాలని వారు కోరుతున్నారు. జైలు వద్దకు జనం చేరుకోవడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
దిశ హంతకులకు కఠిన శిక్ష, చట్టం చేసేందుకు రెడీ:లోక్సభలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
టెన్షన్.. టెన్షన్...
చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరస్థితి నెలకొంది. జైలు వద్దకు భారీగా జనం వస్తున్నారు. దిశ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. సాముహిక లైంగికదాడి చేసి హతమార్చిన మహ్మద్ అలియాస్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, బొల్లు శివ, బొల్లు నవీన్ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు వెంటనే ఉరిశిక్ష తీయాలని డిమాండ్ చేస్తున్నారు. జన సముహం పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసుల మొహరింపు..
జైలు వద్దకు నిమిష నిమిషానికి జనం పెరగడంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మరోవైపు పరిస్థితి అదుపుతప్పుతుందన్న ముందస్తు అంచనాలతో జైలు వద్ద భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు చొచ్చుకొస్తారెమోనన్న సందేహంతో జైలు ముందు.. భారీగా బలగాలను మొహరించారు. జైలు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
ఆందోళనల పర్వం
దిశ ఘటనపై తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జస్టిస్ దిశ అంటూ పలువురు ప్లకార్డులు పట్టుకొని స్లోగన్స్ చేస్తున్నారు. దిశకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు దిశకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.
పీఎస్ నుంచి జైలుకు
దిశ హత్య కేసు నిందితులను శనివారం షాద్ నగర్ పోలీసు స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వారిని తరలించే సమయంలో షాద్ నగర్ పోలీసుస్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు అడ్డుకున్నారు. తమకు అప్పగించాలని, ఐదు నిమిషాల్లో గుణపాఠం చెబుతామని కోరారు. ఇటు చర్లపల్లి జైలు వద్ద కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తొంది. తెలుగురాష్ట్రాల్లోనే కాక.. యావత్ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.