ఈ సారి కాంగ్రెస్, ఫస్ట్ ప్లేస్, 2,3 స్థానాల కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటీ: రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ సభకు సమయం సమీపిస్తోన్న కొద్దీ ఏర్పాట్ల పర్యవేక్షణలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. పనిలో పనిగా అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నారు. తెలంగాణకు అసలైన యజమానులు రైతులు, విద్యార్థులే అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో వాళ్లదే కీలక పాత్ర అని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది కూడా వాళ్లే అని చెప్పారు. రాహల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ భవిష్యత్ వంటి అంశాలపై స్పందించారు.
రైతులు, విద్యార్థులు కేసీఆర్ కుటుంబం చేతిలో దోపిడీకి గురయ్యారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులు ఎక్కువగా నష్టపోయారని చెప్పారు. వరంగల్లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని.. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఇది కాంగ్రెస్ సభ కాదు. రైతుల సభ అని స్పస్టంచేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ ఉస్మానియా వర్సిటీలో పర్యటించబోతున్నారు. తెలంగాణ వచ్చాక వర్సిటీ ప్రభావం కోల్పోయింది. సమస్యలు తెలుసుకుని, పార్లమెంటులో ప్రస్తావించాలని విద్యార్థులు కోరినందుకే రాహుల్ ఉస్మానియాలో పర్యటించబోతున్నారని చెప్పారు.
ఇబ్బందులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తాము ఏర్పాటు చేసిన రాష్ట్రంలో ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. వడ్ల గురించి ఇంతకుముందు కేసీఆర్ మోడీని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగినా స్పందన లేదని చెప్పారు. తెలంగాణ తెచ్చా అని చెప్పుకున్న టీఆర్ఎస్కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని రేవంత్ అన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పోటీపడాలని చెప్పారు.
త్వరలో విద్యార్థులు, యువతకు సంబంధించి పార్టీ విధానాల్ని స్పష్టం చేయబోతున్నామని రేవంత్ తెలిపారు. ఆ తర్వాత మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు సంబందించిన విధానాల్ని ప్రకటిస్తామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ నుంచి కేసీఆర్పై ధర్మయుద్ధం ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాహుల్ వెళ్లింది ఒక వివాహ కార్యక్రమానికి అని, అక్కడ ఆయన చైనా రాయబారితో కలిసి కనిపించారన్నారు. అందులో తప్పేమీ లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.