అంబులెన్స్ల నిలిపివేత ఆదేశాలపై స్టే, రాజ్యాంగాన్నే మార్చేస్తారా? కేసీఆర్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణకు వచ్చే ఇతర రాష్ట్రాల అంబులెన్స్లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీసింది. రాష్ట్రానికి వస్తున్న అంబులెన్స్లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకట క్రిష్ణారావు దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అంబులెన్స్లు ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్లను అనుమతించాలని కోరారు.
Recommended Video
నాలుగు రాష్ట్రాల నుంచి ఏపీకి అంబులెన్స్లను.. ఇక్కడి ప్రజల కోసమే..
ఈ క్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించింది. దీనిపై ప్రభుత్వం తరపున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు కరోనా బాధితుల తాకిడి ఎక్కువైందని కోర్టుకు ఏజీ తెలిపారు. ఆస్పత్రి ముందస్తు అనుమతి ఉన్నవారి అంబులెన్స్లను తాము అడ్డుకోవడం లేదని చెప్పారు. పడకలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఆస్పత్రిలో పడకలు ఉంటేనే ఇతర రాష్ట్రాల రోగులు తెలంగాణకు రావాలని ఇంతకుముందే చెప్పామన్నారు. అంతేగాక, ఢిల్లా లాంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాజ్యాంగాన్ని మీరే మార్చాస్తారా? అంటూ హైకోర్టు ఆగ్రహం
వాదనలు విన్న హైకోర్టు.. కారణం ఏదైనా అంబులెన్స్లను ఆపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. రాజ్యాంగం అన్ని రాష్ట్రాల ప్రజలకు జీవించే హక్కు కల్పించిందని గుర్తు చేసింది. రాజ్యాంగాన్ని మీరే మార్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారుల రాకపోకలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ఇలా చేస్తే జాతీయ రహదారుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లే అవుతుందని మండిపడింది. తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వస్తున్నవారు ముందుగా రిజర్వ్ చేసుకుంటున్నారా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాజ్యాంగ ఉల్లంఘనలే అంటూ ఏపీ ఏజీ వాదనలు
పాజిటివ్ ఉన్నవారి వల్ల తెలంగాణలో వైరస్ వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ కోర్టుకు తెలిపారు. కాగా, ఇతర రాష్ట్రాల ప్రజలను అడ్డుకోవవడం రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘనే అవుతుందని ఏపీ ఏజీ శ్రీరాం కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ తరపు న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు.
ఏపీ, రాష్ట్రాల అంబులెన్స్ల నిలిపివేత ఆదేశాలపై స్టే.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో అనుమతి లేని అంబులెన్స్లను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయాలతో అంబులెన్స్లను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని తెలంగాణ సర్కారు హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణలోకి ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల అంబులెన్స్ వచ్చేందుకు మార్గం సుగమమైంది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.