టీఎస్ఆర్టీసీ సమ్మె గేమ్... విలీనం లేదంటున్న ప్రభుత్వం... వెనక్కి తగ్గమంటున్న కార్మికులు
ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య డబుల్ గేమ్ నడుస్తోంది. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచేయి సాధించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. చర్చలకు ప్రభుత్వమే దిగిరావాలని కార్మికులు కొరుకుంటుంటే ..ప్రభుత్వం మాత్రం కార్మికులే దిగిరావాలని భావిస్తోంది. దీంతో విరుద్ద ప్రకటనలు, వింత వాదనలు ఇరు వర్గాలు వినిపిస్తున్నాయి. అయితే 28 తర్వాతనైనా సమ్మె ముగుస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

20 రోజులు అవుతున్నా పురోగతి లేని సమ్మె
ఆర్టీసీ సమ్మె 20 రోజుకు చేరకుంటున్నా ఇరు వర్గాల మధ్య స్పష్టత వచ్చినట్టు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ వైపు కోర్టు వాదనల ప్రకారం ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్గా తీసుకువస్తున్న విలీనం అంశాన్ని వీడితేనే చర్చలు అంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు అనుగుణంగానే ఆర్టీసీని విలీనం చేయాలంటూ చర్చల్లో పట్టుపట్టబోమని కోర్టులో కార్మిక సంఘాల తరఫున వాదించిన అడ్వకేట్ చెప్పారని, దీంతో కార్మికుల విలీనం డిమాండ్ నుండి వెనక్కి తగ్గారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కార్మిక సంఘాలు లేవనెత్తిన 21 డిమాండ్ల అంశంపై అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విలీనం లేకుండా... చర్చలకు రెఢి అంటున్న ప్రభుత్వం
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్మికుల డిమాండ్లను పరీశీలించి రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇందుకోసం అధికారులతో వేసిన కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఈడీలు బుధవారం ఆర్టీసీ బస్భవన్లో సమావేశం అయ్యారు. కాగా వీలీనం సమస్య లేకుండా అధికారులు ఇచ్చిన నివేదిక పై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అనంతరం ఇదే నివేదికకు సంబంధించిన అంశాలను కూడ ఈనెల 28న చేపట్టనున్న కోర్టు విచారణలో కూడ నివేదించనున్నారు.

విలీనం నుండి వెనక్కి తగ్గేది లేదంటున్న ఆర్టీసీ ప్రతినిధులు
అయితే ఇందుకు విరుద్దంగా నేడు కార్మిక సంఘాల ప్రతినిధులు స్పందించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు తాము ఆర్టీసీ విలీన డిమాండ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలే లేవని ఆర్టీసీ జేఏసీ కన్వినర్ ఆశ్వథ్దామ రెడ్డి స్పష్టం చేశారు. నేడు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఆయన ఎబీనగర్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విలీనంతో పాటు ఏ ఒక్క డిమాండ్ను వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశాడు. అవసరమైతే ఆర్టీసీ సమ్మె ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లండని ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాడు. ప్రజల్లో ఆర్టీసీ సమ్మె అన్యాయమని తేలితే.. సమ్మె నుండి తక్షణమే తప్పుకుంటామని చెప్పారు. ఈనేపథ్యంలోనే ఆర్టీసీని విలీనం చేయడంలో సీఎం కేసీఆర్కు ఉన్న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కోర్టు ఆదేశాలు తప్పవా...
దీంతో ఇరువర్గాలు విలీనంపై పట్టువదలకుండా తమ ప్రయాత్నాలు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.సమ్మెపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడాలంటే కోర్టు సీరియస్గా జోక్యం చేసుకుంటే తప్ప పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు రెండు సార్లు ఆర్టీసీ సమ్మె వాదనలు విన్న కోర్టు ఇరువురుని మందలిస్తూ కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే చేసింది. అయితే ఎలాంటీ ఆదేశాలను జారీ చేయలేదు. దీంతో 28వ తేదిన జరగనున్న వాదనల్లో కూడ కోర్టు ఇచ్చే ఆదేశాలపైనే ఆర్టీసీ సమ్మె ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు ఈసారైన ఇరువురికి ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు ఇస్తుందా లేక మరింత సమయం ఇస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సమస్యపై కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఇరువర్గాలు దిగి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు.












Click it and Unblock the Notifications