50 మంది గుంపులుగా వచ్చి దాడి చేయడమా..? రాములమ్మ ఫైర్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. అయితే ఇవాళ ఆయన యాత్ర చేస్తుండగా దాడి జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి వీడియోలను కూడా రిలీజ్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు కస్సు బుస్సు అంటున్నారు. బీజేపీ నేత విజయశాంతి కూడా స్పందించారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర'పై దాడి చేయడం టీఆర్ఎస్ అరాచక పాలనకు నిదర్శనం అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. అధికార పార్టీ అరాచకాలు రోజురోజు పెరిగి పోతున్నాయని మండిపడ్డారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా వచ్చి ప్రజాసంగ్రామ పాదయాత్రపై, బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం ఏంటీ అని అడిగారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐదో రోజు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పర్యటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తిరిగి బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు.
పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంపై సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ శ్రేణులు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పాదయాత్ర ద్వారా పాలమూరు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.