అలా "బంగారు తెలంగాణ" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్ బాంబ్ పేల్చారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజా అవసరాలను తీర్చడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రకటించారు. అంతేకాదు పోలీస్ వ్యవస్థతో ప్రజలకు ఒరిగేదేమీ లేదంటూ మరో సంచలనానికి తెర తీశారు.
1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీకే సింగ్కు మరో రెండేళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం ఆయన అదనపు డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. రెండేళ్ల నుంచి ఆయనకు డీజీపీ పదోన్నతి కూడా పెండింగ్లో ఉంది. 2014 నుంచి ఐదేళ్లపాటు ఆయన జైళ్ల శాఖలో బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేయడం ఆయనకు నచ్చలేదు. అందుకే ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు.

వీకే సింగ్ మరోసారి సంచలనం
స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ కమిషనర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదంటూ కొత్త చర్చకు తెర లేపారు.
సామాజిక కార్యక్రమాలతో ప్రజల అవసరాలను తీర్చే క్రమంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో అవగాహన కార్యక్రమాలు చేపడతానని చెప్పుకొచ్చారు. అంతేకాదు బంగారు తెలంగాణ సాధన కోసం పని చేస్తానని బాంబ్ పేల్చారు. బుధవారం నాడు హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీకే సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతేకాదు పోలీస్ వ్యవస్థపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే పోలీస్ శాఖకు వచ్చానని .. అయితే పోలీస్ వ్యవస్థతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీగా తాను ఎన్నో సంస్కరణలు చేపట్టానన్నారు వీకె సింగ్. జైళ్లల్లో అనేక మార్పులు తీసుకొచ్చానని.. ఖైదీల సంక్షేమం కోసం అహర్నిశలు పని చేసినట్లు తెలిపారు. అదే క్రమంలో ఆనంద ఆశ్రమంతో కలిసి 15 వేల మంది భిక్షగాళ్లకు ఆశ్రయం ఇచ్చామని చెప్పారు.

సాంఘిక ఉద్యమం చేపడతా.. పనిచేస్తున్న శాఖను మూసివేయాలని కోరుతా..!
విధినిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తున్న తనను తెలంగాణ ప్రభుత్వం అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిందని వాపోయారు. అది కూడా తాను సెలవులో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. జైళ్ల శాఖ నుంచి తనను బదిలీ చేస్తే అక్కడి ఉద్యోగులు చాలా మంది బాధపడ్డారన్నారు. అయితే ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్గా తనను నియమించడం బాధ కలిగించిందని తెలిపారు.
పోలీస్ వ్యవస్థను మార్చడానికి తాను ఆ శాఖను ప్రిఫర్ చేయలేదని.. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే డిపార్టుమెంటులోకి వచ్చానన్నారు. తాను ఇప్పటి వరకు అనేక ప్రభుత్వ శాఖల్లో పని చేశానని చెప్పిన వీకే సింగ్ పోలీస్ శాఖలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందన్నారు. స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ శాఖకు 50 కోట్ల రూపాయల మేర అప్పు ఉందని.. ఆదాయం మాత్రం 2 కోట్ల రూపాయలు మాత్రమే ఉందన్నారు. స్టేషనరీ శాఖలో కమిషనర్గా ఉంటూనే తాను సాంఘిక ఉద్యమం చేపడతానన్నారు. ప్రస్తుతం ఈ శాఖలో తనకు పనేమీ లేదని.. దీన్ని పూర్తిగా మూసేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.

మరో రెండేళ్ల సర్వీసు.. రాజీనామా చేయనున్నారా?
1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీకే సింగ్కు మరో రెండేళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం ఆయన అదనపు డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. రెండేళ్ల నుంచి ఆయనకు డీజీపీ పదోన్నతి కూడా పెండింగ్లో ఉంది. వీకే సింగ్ ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు ఎస్పీగా విధులు నిర్వహించారు. 2001 నుంచి 2005 వరకు సొంత రాష్ట్రమైన బీహార్కు డిప్యుటేషన్పై వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీకే సింగ్ను జైళ్ల శాఖ నూతన డీజీగా నియమించింది.
ప్రభుత్వ అంగీకారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయన 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. ఆ సమయంలోనే బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.

రాష్ట్రపతి పోలీస్ పతకం.. ఎంతో చేశా.. చివరకు ఇలా చేస్తారా?
గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసిన వీకే సింగ్ పనితీరుకు నిదర్శనంగా దేశంలోనే అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పోలీస్ పతకం వరించింది. ఆ తర్వాత జైళ్ల శాఖ డీజీగా ఐదేళ్లు పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే తనకు అప్రాధాన్య పోస్టు కట్టబెట్టిందనేది ఆయన వెర్షన్. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖ కమిషనర్ పోస్టును అదనపు బాధ్యతలుగా కేటాయించేవారని.. తనకు మాత్రం పూర్తిస్థాయి పోస్టింగ్ ఇచ్చి అవమానించారని వాపోతున్నారు వీకే సింగ్.
రాజకీయ పలుకుబడి ఉంటేనే మంచి పోస్టింగ్లు వస్తున్నాయని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు వీకే సింగ్. 30 ఏళ్లకు పైగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తే.. ఏనాడూ కూడా తనకు ఆశించిన పోస్టింగ్ను ఇవ్వలేదనేది ఆయన వాదన. అదలావుంటే తాజా బదిలీల్లో ఆర్టీసీ ఎండీ, విజిలెన్స్ కమిషనర్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అలా ఏదో ఒక చోట పోస్టింగ్ వస్తుందని ఆశించానే తప్ప.. ఇలా అప్రాధాన్యమైన పోస్టుకు బదిలీ చేసి ప్రభుత్వం తనను వేధించాలని చూస్తోందని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications