దయచేసి స్టేజ్-3కి వెళ్లొద్దు: మీరు సేఫ్గా ఉంటే రాష్ట్రం కూడా: మంత్రి ఈటెల ఆవేదన
హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులు కూడా వాళ్లను బయటికి రానీవద్దని, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. అలాంటివారు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వారు బయట తిరిగితే ఉపేక్షించం..
హైదరాబాద్లో సోమవారం మీడియాతో మాట్లాడారు మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 కరోనా పాజిటివ్ కేసులు 33కు చేరుకున్నాయని తెలిపారు. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని, వారికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. క్వారంటైన్లో ఉన్నవారిని 14 రోజుల చికిత్స అనంతరం ఇంటికి పంపిస్తామన్నారు. హోంక్వారంటైన్లో ఉన్నవాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు.
పని ముఖ్యమా ప్రాణాలా ?తేల్చుకోండి
జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం జనం చూపిన స్ఫూర్తిని సోమవారం కొనసాగించడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని లాక్ డౌన్ ప్రకటిస్తే.. కొందరు మాత్రం తమకేం పట్టనట్లు రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలు ముఖ్యమా? వారం రోజుల పని ముఖ్యమా? అని ప్రశ్నించారు.
స్టేజ్-3కి వద్దు..
ప్రస్తుత పది రోజులు చాలా ముఖ్యమైన సమయమని, ఓపికతో ఉంటే వైరస్ ను తరిమికొట్టే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. బాధితుల సంఖ్య పెరకుండా ముందు జాగ్రత్తలు పాటిద్దామన్నారు. వైరస్ సోకిన తర్వాత నయం చేయడం చాలా కష్టమనే విషయం ప్రపంచానికి అర్థమైందని చెప్పారు. నిత్యావసరాల కోసం ఒక్కరు మాత్రమే బయటకి రావాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. ప్రస్తుతం స్టేజ్-2లో ఉన్నామని, స్టేజ్-3కి పరిస్థితి రానీయొద్దని ప్రజలను కోరారు. మార్చి 31 వరకు ఇళ్లకే పరిమితమై కరోనా వ్యాప్తిని అడ్డుకుందామని చెప్పారు.
కరోనా అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి..
కరోనావైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది సైతం విధులకు రావాలని స్పష్టం చేశామని తెలిపారు. పరిస్థితి తీవ్రమైతే ప్రైవేటు ఆస్పత్రులను కూడా వినియోగించుకుంటామని చెప్పారు. సాధారణ ఓపీలు, అత్యవసరం కాని చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లవద్దని కోరారు.