హైదరాబాద్లో దారుణం... వదినపై ముగ్గురు మరుదుల అత్యాచారం... భర్త ప్రోద్భలంతోనే...
హైదరాబాద్లో దారుణం వెలుగుచూసింది. ఓ వివాహితపై ఆమె ముగ్గురు మరుదులు అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త సమక్షంలో... భర్త ప్రోద్బలంతోనే ఈ అఘాయిత్యం జరిగింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని బోరబండ ఇంద్రానగర్కి చెందిన నర్సింహ స్థానికంగా భార్యతో కలిసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన నర్సింహ భార్యతో తరుచూ గొడవపడుతుండేవాడు. ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేవాడు. ఇదే క్రమంలో తన సోదరులతోనూ లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో... 2017లో ఓరోజు ఆమెను ఇంట్లో నిర్బంధించాడు. ఆపై తన ముగ్గురు సోదరులను పిలిచి ఆమెపై అత్యాచారం చేయించాడు.
తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం(మార్చి 24) ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త నర్సింహతో పాటు అతని సోదరులు కృష్ణ, శ్రీనివాస్, మునీందర్లపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వారం రోజుల క్రితం రాజస్తాన్లోని బరాన్ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.ఓ మహిళపై ఆమె మరిది(మాజీ భర్త సోదరుడు) అతని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్కి పాల్పడ్డాడు. భర్తతో కలిసి బయటకెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆ గ్యాంగ్ అడ్డగించారు. బలవంతంగా ఇద్దరినీ సమీపంలోని పంట పొలాల వద్దకు లాక్కెళ్లారు. ఆమె భర్తపై దాడి చేసి అతని కాళ్లు,చేతులు తాళ్లతో కట్టిపడేశారు. అనంతరం అతని ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.