వైఎస్ జగన్ తరఫున స్పెషల్ గెస్ట్: షర్మిల ఖమ్మం సభకు ఊహించని అతిథి: బీజేపీ నేత భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. సంకల్ప సభ పోస్టర్లు, బ్యానర్లను షర్మిల పార్టీ నాయకులు ఇదివరకే విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లడానికి ఉద్దేశించిన రూట్ మ్యాప్ను ప్రకటించారు.
షర్మిల సంకల్ప సభ రూట్ మ్యాప్ ఇదే: దారి పొడవునా రిసీవింగ్ పాయింట్లు: ప్రసంగం ఎప్పుడంటే?
ఊహించని గెస్ట్..
ఈ సంకల్ప సభకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక ఆహ్వానితురాలిగా వైఎస్ విజయమ్మ ఈ సభకు హాజరవుతారని తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ వ్యవహరిస్తోన్నారు. తన కుమార్తె రాజకీయ అరంగేట్రం చేయబోతోండటం.. తెలంగాణ గడ్డ మీద తొలిసారిగా బహిరంగ సభను నిర్వహిస్తోండటం వంటి పరిణామాల మధ్య కుమార్తెకు అండదండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్ లోటస్పాండ్ నివాసానికి వస్తారని, ఆ మరుసటి రోజు ఖమ్మం బయలుదేరి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
కుమార్తెకు అండగా ఉండటానికి..
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ విజయమ్మ.. కుమార్తె నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభకు హాజరవుతారు. తమ కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు గానీ, భేదాభిప్రాయాలు గానీ లేవంటూ ఇటీవలే ఆమె బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. దాన్ని నిజం చేయడంలో భాగంగా- వైఎస్ జగన్ తరఫున.. ఆయనకు చెందిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ ఖమ్మం సంకల్ప సభకు హాజరవుతారని చెబుతున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీకి ఎలాంటి సహాయ, సహకారాలు గానీ, రాజకీయంగా అండదండలు అవసరమైనా తాము అందజేస్తామనే సందేశాన్ని ఈ సందర్భంగా వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు..
ఇదిలావుండగా ఖమ్మంలో షర్మిల నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఇతర పార్టీల్లో కొనసాగుతోన్న కొందరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం పరోక్షంగా షర్మిల సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారనే ప్రచారం ఖమ్మంలో సాగుతోంది. పార్టీ విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రకటించిన తరువాత.. భారీ ఎత్తున చేరికలు ఉండొచ్చని షర్మిల పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
కొనసాగుతోన్న చేరికలు..
సంకల్ప సభ గడువు సమీపిస్తోన్న కొద్దీ వైఎస్ షర్మిల పార్టీలోకి చేరుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు సంగీతా రెడ్డి, గొల్ల కురుమ యువజన సంఘం తెలంగాణ అధ్యక్షుడు కడారి స్టాలిన్ యాదవ్ వైఎస్ షర్మిలను కలిశారు. ఇదివరకే గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్..షర్మిల పార్టీలో చేరారు. సోమవారం ఆమె లోటస్పాండ్లో షర్మిలను కలిశారు. కరీంనగర్, నారాయణ్పేట్ జిల్లాలకు చెందిన పలువురు వేర్వేరు పార్టీల నాయకులు షర్మిలకు మద్దతు ప్రకటించారు.