Covid-19 : ఐసోలేషన్లో ఆ 10 మంది ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది..
ఢిల్లీ,హైదరాబాద్లలో సోమవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసి ఇటీవల ఎయిర్ ఇండియాకి చెందిన వియన్నా-ఢిల్లీ విమానంలో ప్రయాణించడంతో.. అందులోని 10మంది సిబ్బందిని 14 రోజుల పాటు తమ ఇళ్లల్లోనే ఐసోలేషన్లో ఉండాలని అధికారులు సూచించారు. ఈ పీరియడ్లో ఒకవేళ వారిలో కరోనా లక్షణాలు బయటపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు.కరోనా సోకిన ఢిల్లీ వాసి రోడ్డు మార్గం గుండా ఇటలీకి వెళ్లాడని.. ఫిబ్రవరి 25న అతను వియన్నా-ఢిల్లీ విమానంలో ప్రయాణించాడని అధికారులు తెలిపారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఏమన్నారు..
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ మాట్లాడుతూ.. ఢిల్లీ,తెలంగాణల్లో రెండు కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. ఆ ఇద్దరు పేషెంట్స్ స్వయంగా ఆసుపత్రికి వచ్చారని.. వైద్య పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరాన్,ఇటలీ,సౌత్ కొరియా,సింగపూర్ వంటి దేశాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ఎదుర్కొనేందుకు సిద్దమన్న కేంద్రమంత్రి..
సాధారణంగా భారత్కు చైనా నుంచి 70శాతం ఫార్మాసూటికల్ ఏపీఐ దిగుమతి అవుతుంది. ప్రస్తుతం చైనాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్లో మందుల కొరత ఏర్పడే అవకాశం ఉందా అని కేంద్రమంత్రి హర్షవర్దన్ను మీడియా ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని.. ఇప్పటికైతే పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు.
స్క్రీనింగ్ టెస్టులు..
ఇటీవల ఇరాన్ నుంచి తిరిగొచ్చిన 1086 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు. అలాగే ఇటీవల ఖాట్మండు,వియత్నాం,ఇండోనేషియా,మలేషియా,చైనా,హాంకాంగ్,ఇరాన్,ఇటలీ,థాయిలాండ్,సౌత్ కొరియా,జపాన్ నుంచి తిరిగొచ్చిన దాదాపు 5,57,431 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసినట్టు తెలిపారు. అలాగే ఓడ రేవుల వద్ద కూడా 12,431 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్టు వెల్లడించారు. అలాగే ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,బీహార్,వెస్ట్ బెంగాల్,సిక్కీంలలో దాదాపు 10,24,922 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసినట్టు తెలిపారు.
Recommended Video
రాజస్తాన్లోనూ కరోనా..
మరోవైపు రాజస్థాన్లోని జైపూర్లో ఓ ఇటాలీయన్ టూరిస్ట్కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టుగా రాష్ట్ర మంత్రి రఘుశర్మ ఫిబ్రవరి 29న వెల్లడించారు. మొదటి శాంపిల్స్లో అతనికి నెగటివ్ అని తేలినప్పటికీ.. రెండో శాంపిల్స్లో పాజిటివ్గా నిర్దారణ అయిందన్నారు. అయితే శాంపిల్స్ రిపోర్టులో నెలకొన్న గందరగోళం కారణంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ,పుణేకి రక్త నమూనాలు పంపించినట్టు చెప్పారు.భారత్లో మొదట మూడు కరోనా కేసులు కేరళలలో బయటపడ్డ సంగతి తెలిసిందే. వీరిలో చైనాలోని వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఉన్నారు. అయితే గత నెలలో వారి ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.