కల్తీ మద్యం తాగి 10 మంది మృతి: సీఎం సీరియస్
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం(సారా) తాగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు. మంగళవారం రాత్రి కళ్లకురిచ్చిలోని కరుణాపురంలో ఓ వ్యాపారి వద్ద కల్తీ మద్యం ప్యాకెట్లు కొనుగోలు చేసి తాగారు. ఆ తర్వాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తలనొప్పి, వాంతులు, వికారం, కడుపునొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే బాధితులను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి, కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పంది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా వ్యక్తులు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు.

10 మందికి పైగా మెరుగైన వైద్యం అవసరమని పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)కు తరలించారు. రక్త నమూనాలను సేకరించి విల్లుపురం, జిప్మర్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించారు. ల్యాబ్ టెస్టుల్లో మద్యంలో మిథనాల్ అనే విషపదార్థం కలిపినట్లు తేలింది.
ఈ కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జాదావత్ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎంఎస్ ప్రసాద్ను నియమించారు.
జిల్లా ఎస్పీ సమై సింగ్ మీనాని కూడా తొలగించి, రజత్ చతుర్వేదికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, జిల్లా ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని టీమ్ను సస్పెండ్ చేశారు. మంత్రులు ఈవీ వేలు, ఎం సుబ్రమణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రిని సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications