120 కి.మీ వేగం, బ్రేకు ఫెయిల్ .. ట్రక్కును ఢీకొన్న బస్సు, 11 మంది మృతి
హజారిబాగ్ : జార్ఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ డబుల్ డెక్కర్ బస్సు బ్రేకు ఫెయిలవడంతో వేగాన్ని నియంత్రించడం డ్రైవర్కు కష్టంగా మారింది. దీంతో బస్సు రోడ్డు అవతల ఉన్న ట్రక్కును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు కాగా .. 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. దీంతో హజారిబాగ్ ప్రాంతం క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటింది.
బ్రేకు ఫెయిల్ ..
ఎప్పటిలాగే డబుల్ డెక్కర్ బస్సు జాతీయ రహదారి 2 పై హజారిబాగ్ గుండా వెళ్తుంది. అయితే హజారిబాగ్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ బస్సు బ్రేకు ఫెయిలైనట్టు గుర్తించారు. అప్పటికే బస్సు వేగం 120 ఉంది. దీంతో బస్సును నియంత్రించడం కష్టంగా మారింది. డ్రైవర్, కండక్టర్ బస్సు బ్రేకు ఫెయిలైందని ఆరిచారు. ప్రయాణికులను అప్రమత్తం చేశారు. కానీ బస్సు వేగంగా వెళ్తుండటం .. అదుపుతప్పి ట్రక్కును ఢీకొనడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకోవడం సాధ్యపడలేదు.

ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 25 మంది తీయగాయపడ్డారు. వారిని తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం రాంచికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు లోయర్ డెక్కు పూర్తిగా దెబ్బతింది. బస్సు ట్రక్కును ఢీకొన్న తర్వాత అందులోంచి ప్రయాణికులు ఎగిరిపడ్డారని గాయపడ్డ ప్యాసెంజర్ సౌరభ్ కుమార్ మీడియాకు తెలిపారు.
ఏం చేయలేని పరిస్థితి
బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయని డ్రైవర్, కండక్టర్ అరిచారని మరో ప్రయాణికుడు తెలిపారు. బస్సులో ఉన్న వారిని కాపాడేందుకు వారు శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు. కానీ బస్సు వేగాన్ని తగ్గించడం సాధ్యపడలేదని .. అందుకే అవతల ఉన్న రోడ్డుపైకి వెళ్లి ట్రక్కును ఢీకొందని వివరించారు. దీంతో ప్రయాణికులు ఎక్కువ మంది మృతిచెందారని వెల్లడించారు.
ఇదిలాఉంటే హజారిబాగ్ రహదారిపై చాలా ప్రమాదాలు జరిగాయని డీఎస్పీ మనీశ్ వెల్లడించారు. దీనిని స్థానికులు 'బ్లాక్ స్పాట్'గా పిలుచుకుంటారని పేర్కొన్నారు. ఈ రహదారిపై గత ఆరునెలల్లో ఇప్పటికే 150 మంది ప్రజలు చనిపోయారని తెలిపారు. ప్రమాదస్థలిని పరిశీలించామని .. తమ తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications