వ్యాక్సిన్లపై ఎన్టీఏజీఐ సంచలనం -కొవిడ్ సోకిన 6నెలల తర్వాతే టీకా -రెండో డోసుకు 12-16 వారాల గ్యాప్
దేశంలో కరోనా విలయం మళ్లీ ఉధృతంగా మారింది. రెండ్రోజులపాటు తగ్గిన రోజువారీ కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారంనాటి బులిటెన్ ప్రకారం కొత్తగా 3,62,727 కేసులు, 4120 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 37.10లక్షలకుపైగా ఉంది. ఆక్సిజన్ అందక మరణాలు కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల కొరత సవాలుగా మారింది. కేవలం రెండు కంపెనీలకు మాత్రమే అనుమతులిచ్చిన కేంద్రం.. కొత్తగా విదేశీ వ్యాక్సిన్లకు అవకాశం కల్పించకపోవడం వివాదాస్పదమైంది. వ్యాక్సిన్ల కొరతను కప్పిపుచ్చుకోడానికి కేంద్రం, దాని అనుబంధ సంస్థలు కొత్త రకం ఉపాయాలను తెరపైకి తెస్తున్నాయి. అందులో భాగంగా..
Recommended Video

2వ డోసు గడువు పొడగింపు
ప్రస్తుతం మన దేశంలో భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్, సీరం వారి కొవిషీల్డ్ వ్యాక్సిన్లతోపాటు రష్యా తయారీ స్పుత్నిక్-వి టీకాకూ అనుమతి ఉంది. అయితే, కొవిషీల్డ్ టీకాల కోసం డిమాండ్ పెరగడం, సీరం సంస్థ డిమాండ్కు అనుగుణంగా తక్కువ సమయంలో ఉత్పత్తి చేయకపోవడం, కొద్ది మొత్తంలోనే స్ఫూత్రిక్ వి టీకాలకు ఆర్డర్ వెళ్లిన దరిమిలా వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఈ సమస్య నానాటికీ తీవ్రతరం అవుతుండటంతో టీకా మొదటి డోసు, రెండో డోసు మధ్య గడువును పొడిగించేలా, కరోనా బారినపడిన వారు టీకా తీసుకోవాల్సిన సమయాన్ని మరింతగా పెంచేలా నిపుణులు సిఫార్సులు చేయడం సంచలనంగా మారింది..

డోసులకు మధ్య 4నెలల గ్యాప్
కొవిడ్ వ్యాక్సిన్లపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) పలు కీలక సూచనలు, సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచొచ్చని ఈ ప్యానెల్ సిఫార్సు చేసింది. నిజానికి కొవిషీల్డ్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో రెండో డోసును 4 నుంచి 6 వారాల మధ్య తీసుకోవాలనే సూచన ఉండగా, తర్వాతి కాలంలో, అంటే, ఏప్రిల్ నాటికి ఆ గడువు 6-8 వారాలకు పెరిగింది. ఇప్పుడైతే ఏకంగా 12 నుంచి 16 వారాలు, అంటే 4నెలల గ్యాప్ తో రెండో డోసు తీసుకోవచ్చని ఎన్టీఏజీఐ సూచిస్తోంది. ప్రఖ్యాత సైన్స్ జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఆధారంగా ఈ సిఫార్సులు వెలువడ్డాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్ను 12 వారాల తర్వాత తీసుకుంటే సామర్థ్యం 81.3 శాతంగా ఉందని, అదే 6 వారాల గ్యాప్ తో తీసుకుంటే టీకా సామర్థ్యం 55.1 శాతంగా మాత్రమే ఉందని సదరు అధ్యయనంలో పేర్కొన్నారు. యూకే, కెనడాలాంటి దేశాలు 12 వారాలు, 16 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నాయని, రెండో డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కరోనా సోకితే 6నెలల తర్వాతే టీకా..
వ్యాక్సిన్ తొలి, రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాలు గ్యాప్ ఉండాలన్న జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ).. కరోనా బారినపడిన వారు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలనేదానిపైనా కీలక సిఫార్సు చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినవారు 6 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని ఎన్టీఏజీఐ సూచించింది. గర్భిణి మహిళలు అయితే ప్రసవం తర్వాత టీకా ఎప్పుడైనా తీసుకోవచ్చునని చెప్పింది.












Click it and Unblock the Notifications