బిగ్ న్యూస్: రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్- ఏప్రిల్ 1 నుంచి అమలు..!!
జైపూర్: దేశంలో ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భగ్గుమంటోన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వంటగ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయలను ఎప్పుడో దాటి పోయింది. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను మళ్లీ పెంచే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఒక్కో వంటగ్యాస్ సిలిండర్పై కనీసం 25 నుంచి 50 రూపాయల వరకు పెంచే ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఏప్రిల్ 1 నుంచిజజ
ఈ పరిణామాల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి శుభవార్త తెలిపింది. బీపీఎల్ కుటుంబాల వారికి 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ను అందజేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఒకటి.
రూ.500లకే..
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా- తమ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి ఒక్కో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే అందజేస్తామని అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఇలా సంవత్సరానికి 12 సిలిండర్లను సరఫరా చేస్తామని వివరించారు. 12 సిలిండర్ల కోటాను మించితే- దానికి ఈ రాయితీ వర్తించదు.
అట్టర్ ఫ్లాప్..
అల్వార్లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగించారు. ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంటనూనెల, వంటగ్యాస్ సిలిండర్.. ఇలా ప్రతి ఒక్క వాటి ధరలు భగ్గుమంటోన్నాయని, అయినా దాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలను తీసుకోలేకపోతోందని మండిపడ్డారు. ఆర్థికం, రక్షణ, విదేశాంగ విధానాల వ్యవహారాలో మోదీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
వారంతా ఏమయ్యారు?
గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర 25 రూపాయలు పెరిగినా స్మృతి ఇరానీ సహా పలువురు బీజేపీ నాయకులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, బైఠాయింపులు చేశారని, ఇప్పుడు వారంతా ఏమయ్యారని అశోక్ గెహ్లాట్ నిలదీశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ను కూడా విమర్శించారు. డాలర్తో రూపాయి విలువ నానాటికీ పతనమౌతోంటే ఆర్థిక మంత్రి ఏం చేస్తోన్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఒక్కటే..
పేదల సంక్షమం గురించి అహర్నిశలు ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అశోక్ గెహ్లాట్ చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, అలాంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇష్టానుసారంగా నిర్దేశించిన జీఎస్టీ శ్లాబులతో పేద, మధ్య తరగతి కుటుంబీకులపై పెనుభారం పడుతోందని, వాటన్నింటినీ పక్కన పెట్టి బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయడంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీరిక లేకుండా ఉన్నారని మండిపడ్డారు.