కరోనా కలవరం: పిల్లలకు డేంజర్ బెల్స్.. మిజోరంలో వందకు పైగా కేసులు
పిల్లలపై కరోనా రక్కసి విరుచుకుపడుతోంది. మిజోరాంలో ఇవాళ 576 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో 128 మంది చిన్నారులే ఉన్నారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి బారిన పడినవారిలో చిన్నారులతోపాటు ఎనిమిది మంది బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్..చిన్న పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో.. కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇక, థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కొత్త కేసులతో కలిపి మిజోరంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 46,896కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృతిచెందగా.. మృతుల సంఖ్య 173కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఐజ్వాల్ జిల్లాలోనే అత్యధికంగా 323 కేసులు వచ్చాయి. ప్రస్తుతం మిజోరంలో 11,989 యాక్టివ్ కేసులు ఉండగా.. రికవరీ రేటు 74 శాతంగా ఉంది. ఇప్పటివరకు 6.24లక్షల మందికి వ్యాక్సిన్ వేసుకోగా.. వీరిలో 2.13 లక్షల మందికి వ్యాక్సిన్ రెండు డోసులూ అందింది. కోవిడ్ బారిన పడిన ఈ చిన్నారుల్లో తొమ్మిదేళ్ల లోపు వారు 106 మంది ఉన్నారని తెలిపింది.
బెంగళూరులో కూడా కొద్ది రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గత ఐదు రోజుల్లో బెంగళూరులో 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 242 మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు మంగళవారం బెంగళూరు మహానగర పాలికే తెలిపింది. వచ్చే రోజుల్లో ఈ కేసులు మూడింతలకు పెరిగే అవకాశముందని కర్ణాటక ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి అంచనా వేశారు. పిల్లలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండా చూసుకుని.. వైరస్ బారి నుంచి కాపాడుకోవడమే మన చేతుల్లో ఉందని ఆయన తెలిపారు. పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని తెలిపారు.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.