కదులుతున్న బస్సులో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం-బస్సు ఆపమని తల్లి వేడుకున్నా డ్రైవర్ పట్టించుకోని వైనం...
మహిళలపై నేరాలు,అత్యాచారాలకు ఉత్తరప్రదేశ్ కేరాఫ్గా మారింది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై ఆకృత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉందని ఇటీవలే నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించింది. రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగట్లేదు. దీంతో యూపీలో మహిళా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో యూపీలో చోటు చేసుకున్న ఉన్నావ్,హత్రాస్ ఘటనలు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. తాజాగా యూపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై కదులుతున్న బస్సులో 14 ఏళ్ల ఓ బాలికపై అత్యాచారానికి గురైంది.సోమవారం(సెప్టెంబర్ 20) అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ ఫిర్యాదు ప్రకారం... ఆరోజు రాత్రి 11గం. సమయంలో బదర్పూర్ ప్రాంతంలో ఆమె(30) తన కుమార్తె(14),మేనకోడలు(18)తో కలిసి ఓ స్లీపర్ క్లాసు బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్కు దగ్గరగా ముగ్గురు ముందు సీట్లలోనే కూర్చొన్నారు.

బాలికపై అత్యాచారం... బస్సు ఆపాలన్న వినిపించుకోలేదు...
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో.. ఒకసారి ఆమె ఏసీ కేబిన్ వైపు వెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది ఆమెను గమనించి... తమతో పాటు మద్యం తాగాలని కోరారు.చేతికి గ్లాసు అందివ్వబోయారు.దీంతో వెంటనే ఆమె ఆ గ్లాసును కిటికీ నుంచి బయటకు విసిరేసింది.ఆమె చేసిన పనికి కోపోద్రిక్తుడైన బబ్లూ ఆమె చేయి పట్టుకున్నాడు... చేతికి ఉన్న గాజులు పగలగొట్టాడు...ఎలాగోలా ఆమె ఆ కేబిన్ నుంచి ఆమె బయటపడగలిగింది.ఆమె ఆ ఏసీ కేబిన్ నుంచి తన సీటు వద్దకు వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. అటు,ఇటు చూడగా... మరో కేబిన్ నుంచి ఆమె బయటకు రావడం కనిపించింది.అప్పటికే ఆ బాలిక తీవ్ర కన్నీటిపర్యంతమవుతోంది. ఏమైందని తల్లి బాలికను ఆరా తీయగా... తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది.దీంతో బస్సును ఆపాలని డ్రైవర్ను కోరినప్పటికీ అతను వినిపించుకోలేదని... సహా ప్రయాణికులు కూడా పట్టించుకోలేదని వాపోయింది.

యూపీలోని మహిళలపై ఆగని నేరాలు
మరుసటి రోజు ఘటనపై బాధిత బాలిక తల్లి శికోహబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు నిందితులను అన్షు,బబ్లూ అనే వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఇద్దరు అలీగఢ్లోని తప్పల్ వద్ద బస్సు దిగినట్లు గుర్తించారు.ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందాలతో వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై రేప్,పోక్సో చట్టాల కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఎస్పీ శుక్లా వెల్లడించారు.గతేడాది ఇదే యూపీలో జరిగిన హత్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు నెలల క్రితం ఇదే యూపీలోని అమ్రోహ పట్టణంలో తల్లిదండ్రుల ముందే 16 ఏళ్ల ఓ టీనేజీ యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరగడానికి ఒకటి,రెండు రోజుల ముందు.. బాధితురాలి సోదరుడు ఓ యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి కుటుంబం... వారిని వెతికే నెపంతో యువకుడి తల్లిదండ్రులు,అతని సోదరిని వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆ యువతిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటనపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు వెల్లడించారు.
Recommended Video

యూపీలోనే మహిళలపై ఎక్కువ నేరాలు
నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్లో ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది రాజస్తాన్ టాప్ లిస్టులో చేరింది. గతేడాది రాజస్తాన్లో 34,535,ఉత్తరప్రదేశ్లో 49,385,పశ్చిమ బెంగాల్లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.












Click it and Unblock the Notifications