దారుణం : టీనేజ్ యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్-తల్లిదండ్రుల ముందే-ఆ ఘటనకు ప్రతీకారంగా
ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు,ఇతర నేరాలు బయటపడుతూనే ఉన్నాయి. గతేడాది ఇదే యూపీలో జరిగిన హత్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా యూపీలోని అమ్రోహ పట్టణంలో మరో దారుణం వెలుగుచూసింది. తల్లిదండ్రుల ముందే 16 ఏళ్ల ఓ టీనేజీ యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.

అసలేం జరిగింది..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాకి చెందిన ఓ యువకుడు జూన్ 28న తమ గ్రామానికే చెందిన ఓ యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశారు. పారిపోయిన జంటను వెతికేందుకు తమ వెంట రావాలని యువకుడి ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను కోరారు. అయితే వారి ప్లాన్ వేరే ఉందన్న విషయం తెలియక యువకుడి తల్లిదండ్రులు,సోదరి వారితో పాటు వెళ్లారు.

తల్లిదండ్రుల ముందే అత్యాచారం...
ఆ జంటను వెతికే నెపంతో జూన్ 29న అమ్రోహ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంటికి యువకుడి తల్లిదండ్రులను,అతని సోదరిని తీసుకెళ్లారు. అక్కడ యువతి కుటుంబ సభ్యులు వారిపై దాడి చేశారు. అనంతరం 16 ఏళ్ల ఆ యువతిపై ఆమె తల్లిదండ్రుల ముందే గ్యాంగ్ రేప్ చేశారు. పారిపోయిన యువతి తండ్రి,ఆమె సోదరులు,మామలు కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. కళ్లుముందే కన్నబిడ్డపై ఇంత ఘోరం జరుగుతున్నా ఆ తల్లిదండ్రులు నిస్సహాయంగా రోధించడం తప్ప ఏమీ చేయలేకపోయారు.

4 రోజుల పాటు నిర్బంధించి...
అత్యాచారం తర్వాత బాధితురాలి తల్లిదండ్రులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిస్సహాయ స్థితిలో కూతురిని అక్కడే వదిలి ఆ తల్లిదండ్రులు స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత మరో 4 రోజుల పాటు బాలికను అక్కడే బంధించిన యువతి కుటుంబ సభ్యులు,బంధువులు ఆమెపై నిత్యం అత్యాచారం జరిపారు. జులై 4న ఆమెను విడిచిపెట్టారు.

పోలీసులపై ఆరోపణలు
బాలిక ఇంటికి చేరిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిజానికి జులై 29నే తాము పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. వారు కేసు నమోదు చేయలేదని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులకు ఉన్న పలుకుబడి కారణంగా కేసు నమోదవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.మరోవైపు,స్థానిక పోలీస్ అధికారి విద్యాసాగర్ మిశ్రా మాట్లాడుతూ... దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు.
నిజానికి ఆ రెండు కుటుంబాలకు చాలాకాలంగా పరిచయం ఉందన్నారు. తమ కూతురిని తీసుకుని పారిపోయాడన్న కారణంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబ సభ్యులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారని చెప్పారు. అందులో భాగంగానే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు.












Click it and Unblock the Notifications