బుర్ద్వాన్లో బాంబు పేలి ఇద్దరికి గాయాలు... నోయిడాలో పట్టుబడ్డ ఉగ్రవాదులపై అనుమానం?
బుర్ద్వాన్: పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్లో మరో పేలుడు ఘటన చోటుచేసుకుంది. బుర్ద్వాన్ జిల్లా పరిధిలోని దుర్గాపూర్లో శుక్రవారం ఉదయం నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిని అర్జున్ మండాల్, గౌతమ్ మండాల్గా గుర్తించారు.
గాయపడ్డ వారిని తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించినా... మెరుగైన చికిత్స కోసం బుర్ద్వాన్ మెడికల్ కాలేజిలో చేర్పించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నాటు బాంబులను స్ధానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలు తయారు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తుంది.
ఐతే, ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత కొంత కాలంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. బాంబు పేలుడు ఘటనలో పోలీసులు టెర్రరిస్టుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది బుర్ద్వాన్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు బాంబులు తయారుచేస్తున్న క్రమంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి ఘటనలో పేలుడు పదార్థాల తయారీలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడగా, మరొకరు గాయపడ్డ సంగతి తెలిసిందే.
నాటి ఘటనలో పోలీసులు 55 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఘటన కూడా బాంబుల తయారీ సందర్భంగానే చోటుచేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, నోయిడాలో పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులకు పశ్చిమ బెంగాల్లో కలకలం రేపిన బుర్ద్వాన్ ఘటనతో సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.